ఆ తర్వాతే తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు: తేల్చేసిన హైకోర్టు
హైదరాబాద్: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు బ్రేక్ పడింది. బీసీ రిజర్వేషన్ల విషయంలో చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతే తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరపాలని మంగళవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. చట్టపరంగా బీసీ ఓటర్ల జాబితా ప్రచురించిన తర్వాతే పంచాయతీ ఎన్నికలకు ప్రకటన జారీ చేయాలని స్పష్టం చేసింది.
పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో చట్టాలు, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారమే ముందుకెళ్లాలని మధ్యంతర ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఏబీసీడీఈ కేటగిరీలుగా అమలు చేయాలని, ముందుగా బీసీ గణన వివరాలు వెల్లడించాలని.. తదితర అభ్యర్థనలతో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ చేపట్టింది.
కాగా, రాష్ట్రంలో బీసీ జనాభా, ఓటర్లపై స్పష్టత లేకుండానే ఎన్నికలు జరిపేందుకు సిద్ధమవుతున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. బీసీలు 34 శాతం ఉన్నారని శాసనసభలో.. 54 శాతం ఉన్నట్లు సకల జనుల సర్వేలో తేలిందని మరో సందర్భంలో ప్రభుత్వం తెలిపిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బీసీ జనాభా, ఓటర్లను ఏ ప్రాతిపదికన తేల్చారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చే అవకాశం ఉందని అడిగింది. రెండు, మూడు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసేందుకు అంతా సిద్ధమైందని అదనపు అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావు హైకోర్టుకు నివేదించారు. ఇప్పటికే సర్పంచ్లు, వార్డు సభ్యుల పదవీకాలం ముగిసిందని, త్వరగా జరపాల్సిన అవసరం ఉందని వివరించారు.
అయితే, బీసీ రిజర్వేషన్లపై చట్టాలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే ముందుకెళ్లాలని హైకోర్టు స్పష్టంచేసింది. వాటి ప్రకారం ముందుగా బీసీ జనాభా, ఓటర్ల సంఖ్య తేల్చి అభ్యంతరాలను స్వీకరించాలని స్పష్టం చేసింది. ఆ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాతే ఎన్నికల నిర్వహణకు ముందుకెళ్లాలని సూచించింది. నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది.












Click it and Unblock the Notifications