ఎన్నిసార్లు, మళ్లీ వాయిదా అంటే ఫైన్: తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సర్కారు సలహాదారులు, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు, తెలంగాణలో పలు కార్పోరేషన్లకు చెందిన చైర్మన్లకు కేబినెట్ హోదా కల్పించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను వేయాలని వాయిదా కోరిన తెలంగాణ ప్రభుత్వంపై సోమవారం హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఇప్పటికే నాలుగుసార్లు వాయిదా తీసుకున్నారని, మళ్లీ వాయిదా అడగడం ఏమిటని ప్రశ్నించింది. ఇక పైన వాయిదా కోరితే జరిమానా విధిస్తామని తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. మరోసారి వాయిదా కోరితే రూ.3వేలు జరిమానా చెల్లించవలసి ఉంటుందని పేర్కొంది.
సుమారు 19 మందికి రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది. దీనిని నల్గొండ పార్లమెంటు సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు. ఆయన ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యం పైన సోమవారం ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోసలే, జస్టిస్ ఎస్వీ భట్లతో కూడిన న్యాయస్థానం విచారణ చేపట్టింది. అడ్వోకేట్ జనరల్ నగరంలో లేనందున కేసు విచారణను వాయిదా వేయాలని ప్రభుత్వం తరఫున న్యాయవాది మహేందర్ కోరారు. దీనిపై హోకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ పై వ్యాఖ్యలు చేసింది.
రైతుల ఆత్మహత్యలపై వివక్ష దారుణం: మోత్కుపల్లి
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రభుత్వం ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించడంలో వివక్ష చూపడాన్ని తెలంగాణ టిడిపి తీవ్రంగా నిరసిస్తుందని పొలిట్ బ్యూరో సభ్యు డు మోత్కుపల్లి నరసింహులు సోమవారం అన్నారు.
నల్గొండ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని తుంగలో తొక్కుతుందన్నారు. బంగారు తెలంగాణ సాధిస్తామంటూ ఆత్మహత్యల తెలంగాణగా రాష్ట్రాన్ని మార్చిందన్నారు.
సెప్టెంబర్ 19వ తేదికి ముందు ఆత్మహత్యలు చేసుకున్న రైతుకుటుంబాలకు లక్షన్నర ఎక్స్గ్రేషియా, తదుపరి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఆరు లక్షల ఎక్స్గ్రేషియా చెల్లిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ విధానం అసంబద్ధంగా ఉందన్నారు.