కొత్త జిల్లాల స్వరూపమిదీ: రంగారెడ్డి ప్రత్యేకం, 31కే ప్రభుత్వం మొగ్గు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపాదిత 17 కొత్త జిల్లాలతో పాటు గద్వాల, జనగామ, సిరిసిల్ల, ఆసిఫాబాద్లపై ప్రభుత్వం సానుకూలంగానే ఉంది. ఈ నాలుగు జిల్లాల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలు, ప్రజల వినతులను సమీక్షించిన కే కేశవరావు నేతృత్వంలోని హైపవర్ కమిటీ సీఎం కేసీఆర్కు నివేదికను సమర్పించింది.
దీంతో కొత్త జిల్లాల ఏర్పాటుకు తుది నోటిఫికేషనను శనివారం లేదా ఆదివారం జారీ చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. కొత్త జిల్లాల ఏర్పాటుపై మంత్రివర్గ సమావేశంలో సుమారు 3 గంటల పాటు సుదీర్ఘంగా చర్చ జరిగింది. కాగా, జిల్లాల సంఖ్య 31 ఖాయమని అంటున్నారు.

అత్యధిక జనాభా ఉండేది రంగారెడ్డి జిల్లాలో
కొత్త జిల్లాల ఏర్పాటులో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉండేది రంగారెడ్డి జిల్లాలో కాగా అతి తక్కువ విస్తీర్ణం ఉండే జిల్లా కూడా రంగారెడ్డినే అంటున్నారు. ఇక, అతి ఎక్కువ విస్తీర్ణం ఉండే జిల్లా భూపాలపల్లి అయితే.. అతి తక్కువ జనాభా ఉండేది ఆసిఫాబాద్ (కొమురం భీం) జిల్లా. అతి ఎక్కువ మండలాలు ఉండేది నల్లగొండలో అయితే, అత్యల్ప మండలాలు ఉండేది వరంగల్ అర్బన్లో. పునర్వ్యవస్థీకరణ తర్వాత జిల్లాల పరిస్థితి ఇలా ఉంది.

తుది నోటిఫికేషన్కు అంతా సిద్ధం
తుది నోటిఫికేషన్ కోసం తెలంగాణ ప్రభుత్వం సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ మేరకు సీసీఎల్ఏ కార్యాలయం నుంచి హైదరాబాద్ మినహా మిగిలిన 9 జిల్లాలను పునర్వ్యవస్థీకరించి, 30 జిల్లాలను ఏర్పాటు చేసేలా వివరాలను ప్రభుత్వానికి నివేదిక పంపించారు. దీంతో ఇప్పటి వరకూ 459 మండలాలుండగా అదనంగా 119 కొత్త మండలాలతో కలిపి మండలాల సంఖ్య 578కి చేరింది. తెలంగాణలో 45 రెవెన్యూ డివిజన్లు ఉండగా కొత్తగా 20 డివిజన్లు చేరడంతో ఆ సంఖ్య 65కు చేరింది.

జోగులాంబ జిల్లాలోనే గద్వాల, ఆలంపూర్ నియోజకవర్గాలు
గద్వాల, ఆలంపూర్ నియోజకవర్గాలను కొత్తగా ఏర్పాటు చేసే జోగులాంబ జిల్లాలోనే ఉంచాలని నిర్ణయించారు. కొత్తగా కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ చేయాలని కూడా మంత్రివర్గం నిర్ణయించినట్టు తెలిసింది. అన్ని జిల్లాలను ఒకే సమయంలో ప్రారంభిస్తే బాగుంటుందని కేబినెట్లో అభిప్రాయం వ్యక్తమైంది. దీనికి సంబంధించిన ముహూర్తాన్ని రెండు రోజుల్లో ఖరారు చేస్తారు. పరేడ్ నిర్వహించి, జాతీయ పతాకం ఆవిష్కరణ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

కొత్త జిల్లా బాధ్యతలను స్వీకరించనున్న కలెక్టర్లు
కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత జిల్లా బాధ్యతలను కలెక్టర్ స్వీకరిస్తారు. అదే రోజు పబ్లిక్ మీటింగ్లు ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రజా ప్రతినిధులు ఏదో ఒక ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనాలని ముఖ్యమంత్రి సూచించిన ట్టు సమాచారం. కొత్త జిల్లాలకు కొండా లక్ష్మణ్ బాపూ జీ, జయశంకర్, సురవరం ప్రతాప్రెడ్డి, రాజు బహదూర్ వెంకట్రామిరెడ్డి, వెంకటస్వామి, మహేంద్రనాథ్, పీవీ నరసింహారావు, రాజన్న, భద్రాద్రి, జోగులాంబ, కొమురంభీం వంటి పేర్ల ఖరారుపై చర్చించారు.












Click it and Unblock the Notifications