మునుగోడులో హైటెన్షన్... కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అరెస్ట్... త్వరలోనే తామేంటో చూపిస్తామన్న ఎమ్మెల్యే...
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.మునుగోడులో మంత్రి జగదీశ్ రెడ్డి పర్యటనను అడ్డుకుంటామని రాజగోపాల్ రెడ్డి ప్రకటించడంతో... పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. రాజగోపాల్ రెడ్డితో పాటు చిట్యాల,నార్కట్పల్లి,నకిరేకల్,రామన్నపేట్లలో కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు.
అరెస్ట్ అనంతరం రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ... మంత్రి జగదీశ్ రెడ్డికి సిగ్గు,శరం ఉంటే మునుగోడు అభివృద్ది కోసం నిధులు తీసుకురావాలన్నారు. మునుగోడుకు ఒక్క రూపాయి నిధులు తీసుకురాని మంత్రి... రేషన్ కార్డులు పంపిణీ చేసే ఓ చిన్న కార్యక్రమం కోసం నియోజకవర్గానికి వస్తున్నారని విమర్శించారు. హుజురాబాద్లో దళిత బంధు అమలుచేసినట్లే రూ.2వేల కోట్లతో మునుగోడు నియోజకవర్గంలోనూ అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఒక్క హుజురాబాద్ మాత్రమే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా దళిత బంధు అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం దళితులంతా ఏకం కావాలన్నారు. ఎక్కడికక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేలను దీనిపై నిలదీయాలన్నారు.
హుజురాబాద్లో ఈటల రాజేందర్ను ఓడించాలన్న కుట్రతోనే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చారని ఆరోపించారు. దళిత బంధు ఒక బూటకపు పథకమని ఆరోపించారు.అరెస్టులకు,నిర్బంధాలకు తాము భయపడేది లేదన్నారు.అధికారం శాశ్వతం కాదని... తామేంటో త్వరలోనే చూపిస్తామని హెచ్చరించారు.
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి అరెస్టును ఖండించారు. సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని... హిట్లర్ను మించిపోయారని ఆరోపించారు. ఏడేళ్లుగా గుర్తు రాని రేషన్ కార్డులు ఇప్పుడే గుర్తుకొచ్చాయా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గ్రామానికి కనీసం 40 రేషన్ కార్డులు కూడా పంపిణీ చేయట్లేదని విమర్శించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట కనీస ప్రోటోకాల్ పాటించకపోవడమేంటని నిలదీశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ఇటీవల చౌటుప్పల్లో జరిగిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి,ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. జగదీశ్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో రాజగోపాల్ రెడ్డి మైక్ లాక్కోవడంతో... జగదీశ్ రెడ్డి,టీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ శ్రేణులు కూడా అంతే స్థాయిలో స్పందించడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇరు వర్గాలు పరస్పరం వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు. దీంతో సభలో కాసేపు ఉద్రిక్తత తలెత్తింది.
ఈ నేపథ్యంలో మంత్రి జగదీశ్ రెడ్డి మునుగోడు పర్యటన సందర్భంగా 10వేల మంది దళితులతో నిరసన తెలియజేస్తామని రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. దళిత బంధు పథకాన్ని మునుగోడులోనూ అమలుచేయాలని డిమాండ్ చేశారు. జగదీశ్ రెడ్డి పర్యటనను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకునే అవకాశం ఉండటంతో పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు.