యాదాద్రిలో ఉద్రిక్తత.. : ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, కోమటిరెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం..
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో యాదగిరి గుట్టలోని కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నిస్తున్నారని ఆలేరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీత, మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు మా మద్దతుతో గెలిచారంటే.. మా మద్దతుతోనే గెలిచారని వాగ్వాదానికి దిగారు.
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ఆలేరులో కాంగ్రెస్ ఓటమిపాలైతే తాము అక్కడికి వెళ్లలేదని చెప్పారు. కానీ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మాత్రం యాదగిరిగుట్టకు వచ్చి తమవాళ్లను కొనేందుకు
ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు తమ మద్దతుతోనే గెలిచారని చెప్పారు. తమపై గుండాయిజం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. అయితే కోమటి బ్రదర్స్ ఆరోపణలను గొంగిడి సునీత కొట్టిపారేశారు. గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రం లోపలే ఉన్నారని.. తాము ఏ పార్టీలోకి వెళ్లట్లేదని వారు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పారు. అలాంటప్పుడు టీఆర్ఎస్ వారిని కొనేస్తుందంటూ ఆరోపించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు.

కాగా,యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలో 12 కౌన్సిలర్ స్థానాలు ఉన్నాయి. ఇందులో టీఆర్ఎస్ 4,కాంగ్రెస్ 4,సీపీఐ 1,ఇండిపెండెంట్స్ 3 స్థానాలను గెలుచుకున్నారు. ఛైర్మన్ పదవికి మేజిక్ ఫిగర్ 7 కావడంతో.. ఇరు పార్టీలు ఇండిపెండెంట్లకు గాలం వేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదిలా ఉంటే,స్థానిక సంస్థల ఎన్నికల తరహాలోనే మున్సిపల్ ఎన్నికలను కూడా టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసేసింది. కాంగ్రెస్,బీజేపీలు అధికార పార్టీని అందుకోలేనంత దూరంలో ఉండిపోయాయి. ఇప్పటివరకు వెలువడ్డ ఫలితాల్లో టీఆర్ఎస్ దాదాపు 109 స్థానాలు గెలుచుకోగా.. కాంగ్రెస్ 4,బీజేపీ 2 స్థానాలను మాత్రమే గెలుచుకున్నాయి. తాజా గెలుపుతో తెలంగాణలో తమకు తిరుగులేదని టీఆర్ఎస్ మరోసారి నిరూపించుకుంది.












Click it and Unblock the Notifications