హిందువుల మనో భావాలను గాయపరిచారు..! కేసీఆర్, కేటీఆర్ పై బీజేపి తీవ్ర ఆరోపణ..!!
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, టీఆర్ఎస్ వర్కింగ ప్రెసిడెంట్ కేటీఆర్ హిందువులను కించపరిచి, రెచ్చగొట్టి, హిందువుల మనోభావాలను గాయపరిచారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే. లక్ష్మణ్ విమర్శించారు. ఎంఐఎం అధినేత ఓవైసీ ని మచ్చిక చేసుకోవడం కోసం హిందువులను అవమానించారని, కేటీఆర్ అక్రమ చొరబాటు దారుల మీద వ్యక్తం చేసిన అభిప్రాయం దేశ ప్రజల మనోభావాలకు విరుద్దంగా ఉందని అన్నారు.
ఓవైసీ మెప్పుకోసం, ముస్లింలను మచ్చిక చేసుకోవడంకోసం, బీజేపిని టార్గెట్ చేయడం వారి అపరి పక్వతకు నిర్శనమని లక్ష్మణ్ మండి పడ్డారు. అక్రమ చొరబాటు దారులకు మతం రంగు పులుముతున్నారని. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం గడ్డి కరుస్తున్నారని ఆరోపించారు. మజ్లీస్ మద్దతుతో రోహింగ్యాలు, బాంగ్లాదేశ్ ప్రజలకు అన్ని వసతులు కల్పిస్తున్నారు. హిందువులను, సైన్యాన్ని అవమాన పరిచే విధంగా మీరు చేసిన మాటలు విచిత్రంగా ఉన్నాయని కేటీఆర్ ను ఉద్దేశించి అన్నారు.
రాజకీయ పార్టీ గుర్తులతో జరిగే పరిషత్ ఎన్నికలను ఆదరా బాదరాగా చేస్తున్నారని, పార్టీ లో చర్చించి పరిషత్ ఎన్నికల మీద నిర్ణయం తీసుకుంటామని లక్ష్మణ్ తెలిపారు. బీజేపీకి దేశ వ్యాప్తంగా ఎంపీ ఎన్నికల్లో సీట్లు పెరుగుతాయని, ఓట్ల శాతం పెరుగుతుందని, మోదీ ప్రభుత్వంలో తెలంగాణ భాగస్వామ్యం ఉంటుందని తెలిపారు.
నిజామాబాద్ లో బీజేపీ గెలవబోతోందని, దేశం మొత్తం రైతులకు కోపం ఉంటే కేవలం సీఎం బిడ్డ కవితకు వ్యతిరేకంగా మాత్రమే ఎందుకు పోటీ చేశారో చెప్పాలన్నారు. గులాబీ సర్కార్ నిర్లక్ష్యం పైన రైతుల తిరుగుబాటు చేశారని, బిడ్డ ఓడిపోతోంది కాబట్టే టీడిపి మాజీ మంత్రి మండవ దగ్గరకి కేసీఆర్ వెళ్ళాడని విమర్శించారు. పార్లమెంట్ ఫలితాల తరువాత చంద్రశేఖర్ రావు సచివాలయం బాట పట్టక తప్పదు అని లక్ష్మణ్ స్పష్టం చేశారు.