ప్రియుడు దక్కలేదని అతని భార్యకు హెచ్ఐవీ ఇంజెక్షన్ చేసిన మహిళ..
తన కుమార్తె తనకు నచ్చని వ్యక్తిని ప్రేమించిందనే కోపంతో ఒక తండ్రి హెచ్ఐవీ పాజిటివ్ రక్తాన్ని ఆమెకు ఇంజెక్ట్ చేసిన ఘటనల తెలంగాణలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణలోని ఇల్లెందులో జరిగిన యధార్థ గాధ ఆధారంగా దానిని రీసెంట్ గానే సినిమాగా కూడా తెరకెక్కించారు. అయితే సరిగ్గా అలాంటి వికృతమైన ఆలోచనే కర్నూలు జిల్లాలో ఒక మహిళకు రావడం సంచలనం రేపింది. కేవలం అసూయ, కక్షతో తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కక్షతో, ఒక మహిళా డాక్టరుకు హెచ్ఐవీ రక్తాన్ని ఇంజెక్ట్ చేసింది ఓ మహిళ. సాటి మహిళను జీవితాంతం ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఇంతటి దారుణానికి ఒడిగట్టడం సభ్య సమాజాన్ని సైతం నిర్ఘాంతపోయేలా చేస్తుంది.
అసలేం జరిగిందంటే..
ఈ ఘటన ఈ నెల 9వ తేదీన కర్నూలు నగరంలో చోటుచేసుకుంది. ఒక మహిళా వైద్యురాలు తన విధులు ముగించుకుని స్కూటీపై ఇంటికి వెళ్తుండగా.. ముందస్తు ప్రణాళిక ప్రకారం నిందితులు ఆమెను బైక్తో ఢీకొట్టారు. ప్రమాదం జరిగిందని భావించిన ఆ డాక్టర్ కింద పడిపోగా, అక్కడే ఉన్న నలుగురు నిందితులు ఆమెకు సాయం చేస్తున్నట్లు నటించారు. ఆటో ఎక్కిస్తామనే నెపంతో ఆమెను సమీపించి, ఆ గందరగోళంలో బాధితురాలి శరీరంలోకి హెచ్ఐవీ రక్తం ఉన్న ఇంజెక్షన్ను బలవంతంగా గుచ్చారు. ఆ సమయంలో డాక్టర్ గట్టిగా కేకలు వేయడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు..
తనపై విష ప్రయోగం జరిగిందని అనుమానించిన వైద్యురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ పర్యవేక్షణలో పోలీసులు సీసీ కెమెరాలు, సెల్ టవర్ లోకేషన్లను విశ్లేషించారు. ఈ దర్యాప్తులో బీచుపల్లి బోయ వసుంధర అలియాస్ వేదవతి, కొంగె జ్యోతి, భూమా జశ్వంత్, భూమా శృతి అనే నలుగురు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితురాలు వసుంధర ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుండటమే ఈ క్రూరమైన ఆలోచనకు పునాది అని విచారణలో తేలింది.
పోలీసుల విచారణలో నిందితురాలు వసుంధర తన నేరాన్ని అంగీకరించింది. ఆమె గతంలో ఒక డాక్టరును గాఢంగా ప్రేమించిందని.. అయితే ఆ డాక్టర్ వసుంధరను కాదని, ఆ వైద్యురాలిని వివాహం చేసుకున్నాడని తెలిపింది. దాంతో ఆమెపై కక్ష పెంచుకున్న వసుంధర.. ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుల సహకారంతో హెచ్ఐవీ సోకిన రోగుల నుంచి రక్తాన్ని సేకరించి, ఆ రక్తాన్ని తన ఎక్కించాలని ప్లాన్ చేసినట్టు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక నర్సుగా ఉండి రక్త మార్పిడి ద్వారా వ్యాధులు ఎలా ప్రబలుతాయో తెలిసి కూడా ఇలాంటి పనికి ఒడిగట్టడం దారుణమని మండిపడుతున్నారు. ప్రస్తుతం నిందితులందరినీ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. బాధితురాలు వెంటనే అప్రమత్తమై పోలీసులను ఆశ్రయించడం.. చికిత్స ప్రారంభించడంతో ప్రాణాపాయం తప్పే అవకాశం ఉందని వైద్యులు భావిస్తున్నారు. ఈ వ్యవహారం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రానున్న రోజుల్లో ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications