రేవంత్ రెడ్డికి నోటీసులు - 48 గంటల డెడ్ లైన్..!!
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి హెచ్ఎండీఏ నోటీసులు జారీ చేసింది. ఓఆర్ఆర్ టెండర్ల వ్యవహారం పైన రేవంత్ చేసిన ఆరోపణలను సీరియస్ గా తీసుకుంది. నిరాధారమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని అభిప్రాయ పడింది. బిడ్లకు సంబంధించిన పూర్తి వివరాలు పబ్లిక్ డొమైన్లో సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపింది. నిరాధారణ ఆరోపణలు చేసినందున నోటీసు అందుకున్న 48 గంటల్లో బేషరతుగా హెచ్ఎండీఏకు క్షమాపణ చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది.
ఓఆర్ఆర్ టెండర్ల వివాదం కొత్త మలుపు తీసుకుంది. ఈ వ్యవహారం పైన టీపీసీసీ చీఫ్ రేవంత్ చేసిన ఆరోపణలపైన ఇప్పుడు హెచ్ఎండీఏ నోటీసులు చేసింది. నోటీసులు అందుకున్నాక, 48 గంటల్లోగా బహిరంగంగా, బేషరతు క్షమాపణలు చెప్పాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేసింది హెచ్ఎండీఏ. లేదంటే, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్ఎండీఏ హెచ్చరించింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కంటే ఓఆర్ఆర్ టోల్ స్కాం వెయ్యి రెట్లు పెద్దదని రేవంత్ ఆరోపణలు చేసారు. లక్షకోట్ల ఆస్తిని కేవలం 7వేల కోట్లకు కట్టబెట్టారని విమర్శించారు. దీనిపై ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని నిలదీసారు. నోటీసులు జారీ చేసిన హెచ్ఎండీఏ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ప్రకటనలు చేస్తున్నారని పేర్కొంది.

ఒక జాతీయ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా, పార్లమెంటు సభ్యుడిగా..రేవంత్ ఇలాంటి నిరాధారమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని అభిప్రాయ పడింది. హెచ్ఎండీఏకు, ఐఆర్బీ ఇన్ఫ్రాకు మధ్య కుదిరిన ఒప్పందంపై వాస్తవాలను ధ్రువీకరించుకోకుండా అస్పష్టమైన, నిర్లక్ష్యపు ప్రకటనలు చేశారని, ఆ ఆరోపణలన్నింటికీ ఎలాంటి ప్రాథమిక ధ్రువీకరణ కూడా లేదని అర్థమవుతున్నదని పేర్కొంది. ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్ నిర్ణీత సమయంలో 10 శాతం డిపాజిట్ చెల్లించాలని, అలాంటి చెల్లింపులు చేయకుండా, హెచ్ఎండీఏ నుంచి గడువు కోరిందని ప్రకటించారు. టెండరు నిబంధనల్లో ఎక్కడా ఇది లేదని వివరిస్తున్నారు. వాస్తవం తెలుసుకోకుండా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపాలనే దురాలోచనతో మాట్లాడారని వివరించింది.
రాజకీయ మైలేజీ పొందాలనే ఏకైక ఉద్దేశంతో ఇలాంటి ప్రకటన చేసినట్టు అర్థమవుతున్నదని స్పష్టం చేసింది.నిరాధారణ ఆరోపణలు చేసినందున నోటీసు అందుకున్న 48 గంటల్లో బేషరతుగా హెచ్ఎండీఏకు క్షమాపణ చెప్పాలని స్పష్టం చేసింది. దీని పైన రేవంత్ మాత్రం ససేమిరా అంటున్నారు. ఓఆర్ఆర్ లీజు విషయంలో కన్సెషనల్ అగ్రిమెంట్లోని అంశాలను, టెండర్ ప్రక్రియలో జరిగిన విషయాలనే తాను ప్రస్తావించానని, వాస్తవాలను వక్రీకరించలేదన్నారు రేవంత్. తానూ క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని, లీగల్గానే పోరాడడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications