బీజేపీ నేతలకు అమిత్ షా రోడ్ మ్యాప్ - టార్గెట్ ఫిక్స్..!!
తెలంగాణ బీజేపీ నేతలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా మార్గనిర్దేశం చేసారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా పార్టీకి చెందిన ముఖ్య నేతలతో షా భేటీ అయ్యారు. ప్రధానంగా మునుగోడు ఉప ఎన్నిక పైన చర్చించారు. సర్వే నివేదికల ఆధారంగా కీలక సూచనలు చేసారు. మునుగోడులో నేతలంతా కలిసి కట్టుగా ప్రతీ ఇంటికి వెళ్లేలా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పైన తెలంగాణలో వ్యతిరేకత పెరుగుతోందంటూ చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. మునుగోడులో పార్టీ నేతలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు..వాటిని విస్మరించిన తీరును వివరించాలని నిర్దేశించారు.

తెలంగాణలో ఎన్నికల్లో గెలవాల్సిందే
అదే విధంగా రాష్ట్రంలోని లోక్ సభ స్థానాలు .. అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్దం అయ్యే విధంగా కార్యాచరణ డిసైడ చేసారు. బూత్ స్థాయి కమిటీల పని తీరు పైన ప్రతీ నియోజకవర్గంలో సమీక్ష చేయాలని ఆదేశించారు. ప్రతీ పది ఇళ్లకు ఒక కార్యకర్తను కేటాయించాలని.. ప్రతీ బూత్ నుంచి నియోజకవర్గం వరకు సమన్వయం - సమిస్టి తత్వంతో పని చేయాలని సూచించారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాల పైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అదే సమయంలో బీజేపీ ఇప్పటి వరకు రాష్ట్రంలో గెలుస్తూ వచ్చిన పార్లమెంటరీ నియోజకవర్గాలు... అసలు గెలవని నియోజకవర్గాలను కేటగిరీ వారీగా డిసైడ్ చేసారు.

పార్టీ నేతలకు అమిత్ షా మార్గ నిర్దేశం
దేశ వ్యాప్తంగా బీజేపీ ఈ సారి 200 సీట్ల పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసిందని..అందులో తెలంగాణ పరిధిలోని సీట్ల పైన చర్చ చేసినట్లుగా తెలుస్తోంది. బీజేపీ 2019 ఎన్నికల్లో నాలుగు లోక్ సభ సీట్లు గెలవగా.. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు దక్కించుకోవటమే లక్ష్యంగా పని చేయాలని అమిత్ షా పార్టీ నేతలకు నిర్దేశించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తో పాటుగా మరి కొందరు ముఖ్య నేతలు ఎక్కువ సమయం తెలంగాణలో పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేసే విధంగా సమయం కేటాయించాలని షా ఆదేశించారు. మునుగోడు బై పోల్ లో గెలవటం ద్వారా టీఆర్ఎస్ పైన మానసికంగా పై చేయి సాధిస్తామనే భావనలో బీజేపీ నేతలు కనిపిస్తున్నారు.

మునుగోడులో గెలవాలంటూ
ఇదే అంశం పైన మునుగోడులో క్షేత్ర స్థాయి పరిస్థితుల పైన షా ఆరా తీసారు. తెలంగాణ నుంచి 19 మంది కీలక నేతలతో కలిపి కోర్ టీం ఏర్పాటు చేసారు. వీరంతా మునుగోడుతో పాటుగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పని చేస్తారని చెబుతున్నారు. మునుగోడులో గెలుపు పైనే ఎక్కవగా ఈ సమావేశంలో చర్చించారని తెలుస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాలు.. అమలు కాని హామీల విషయంలో మరింత గట్టిగా పోరాటం చేయాలని పార్టీ శ్రేణులను అమిత్ షా ఆదేశించారు. జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేయాలని..తెలంగాణ వ్యవహారాల పైన తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని పార్టీ నేతలకు అమిత్ షా హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications