హోంమంత్రి టార్గెట్; రాజకీయ దుమారం రేపుతున్న అమ్నీషియా పబ్ బాలిక గ్యాంగ్ రేప్!!
ఆమ్నీషియా పబ్ మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ఘటన తెలంగాణ రాష్ట్రంలో చిలికి చిలికి గాలివానగా మారుతోంది. మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ఘటనలో ఓ ఎమ్మెల్యే కొడుకు, వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు ఉన్నారన్న ఆరోపణలతో తెలంగాణ ప్రతిపక్ష పార్టీల నాయకులు రంగంలోకి దిగారు. అధికార టీఆర్ఎస్ పార్టీని, ఎంఐఎం పార్టీ ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ కేసులో దర్యాప్తు పారదర్శకంగా జరగాలని, నిందితులు ఎవరైనా సరే శిక్షించాలని ప్రతిపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ఆమ్నీషియా పబ్ ఘటన ... కెసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి
తాజాగా ఆమ్నీషియా పబ్ వద్ద మైనర్ బాలికను బెంజ్ కార్ లో తీసుకువెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన పై అటు కాంగ్రెస్ నేతలు , ఇటు బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణా రాష్ట్రంలో బాలికలకు రక్షణ కరువైందని మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కెసిఆర్ ప్రభుత్వంలో ఆడపిల్లలకు రక్షణ లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
పదిహేడేళ్ల ఆడ బిడ్డ పై అత్యాచారం జరిగి ఐదు రోజులు కావస్తున్నా అరెస్టు చేయకపోవడం దారుణమని ఆయన మండిపడ్డారు. నిందితులకు సర్కార్ కంచె గా మారిందని సిగ్గుంటే సీఎం కేసీఆర్ స్పందించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బాధితురాలు ఫిర్యాదు చేసిన తర్వాత కూడా నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదని మహిళా కాంగ్రెస్ నేతలు సైతం ప్రశ్నిస్తున్నారు.
ఘటనపై మండిపడిన బీజేపీ నేతలు ఈటల, రఘునందన్ రావు తదితరులు
మైనర్ పిల్లలు పబ్ లకు వెళుతుంటే పోలీసు యంత్రాంగం నిద్రపోతున్నారా అంటూ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రశ్నించారు. ఒక పార్టీకి చెందిన వారి పిల్లలు మైనర్ బాలికను రేప్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి అని పోలీసులు ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా తప్పు చేసిన వారికి శిక్ష పడేలా చూడాలని కోరారు ఈటల రాజేందర్ .
రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు. మే 28వ తేదీన జూబ్లీహిల్స్ పబ్ లో హోం మంత్రి మనవడు బ్యాచిలర్ పార్టీ ఇచ్చాడని, దాని కోసం మంత్రి పిఏ పబ్ బుక్ చేశాడని పేర్కొన్నారు. ఇందులో హోం మంత్రి మనవడు, ఓ ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు, వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు, అలాగే ప్రముఖ హిందీ పత్రిక యజమాని కొడుకు ప్రమేయం ఉందని రఘునందన్ రావు ఆరోపించారు.
నిందితులను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రతిపక్షాల మూకుమ్మడి దాడి
అంతేకాదు గ్యాంగ్ రేప్ కేసులో అసలు నిందితులను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. సిసి టివి ఫుటేజ్ లో ఒక్క సెకండ్ తొలగించినట్లు తెలిసినా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆయన తేల్చి చెప్పారు. ప్రపంచం లో ఎక్కడా లేనన్ని సిసి కెమెరాలు తెలంగాణా లో ఉన్నాయని చెప్పుకుంటున్నారని మరి వాటి ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు.
1200 కోట్ల రూపాయలు పెట్టిన పోలీస్ కమాండ్ సెంటర్, సిసి కెమెరాలు పనిచేయడం లేదా? అంటూ మండిపడ్డారు. ఇప్పటివరకు రేప్ కోసం ఉపయోగించిన కారును ఎందుకు సీజ్ చేయలేదని ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రశ్నించారు. ఇలాంటి కేసులో సామాన్యులు ఉంటే వెంటనే వారిని అరెస్ట్ చేస్తారు పోలీసులు అంటూ మండిపడ్డారు.
ఎఫ్ఐఆర్ లో నిందితుల పేర్లు లేవని ఆరోపణలు...
నిరసనలకు దిగితే ప్రతిపక్షాలపై కఠినంగా వ్యవహరించే పోలీసులు ఓ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో ఇలా వ్యవహరించడం బాధాకరమని వారు మండిపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో ముద్దాయిల పేర్లు పెట్టకపోవడం వెనుక అసలు కారణం ఏమిటని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలు, ఈ ఘటనలో హోంమంత్రి మనవడు, వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు, మరో ఎమ్మెల్యే కొడుకు నిందితులుగా ఉన్నందున వారి పేరును ఎఫ్ఐఆర్లో చేర్చలేదంటూ ఆరోపించారు. వెంటనే హోం మంత్రిని పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. మరి ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఏం చేస్తుందో వేచి చూడాలి.