కేసీఆర్ హానీమూన్ క్లోజ్, దుమ్ముదులపండి(పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి, ఆ ప్రభుత్వం హానీమూన్ పూర్తయిందని, ఇక ఉతికేయండని పార్టీ శ్రేణులకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ మంగళవారం పిలుపునిచ్చారు. తెరాసపై ఇక ఉపేక్షించొద్దన్నారు. మై హోం, ఫాస్ట్, రుణమాఫీ ఇలా అన్ని అంశాలపై దూకుడు పెంచాలని సూచించారు. తెలంగాణలో కుటుంబ పాలనకు వ్యతిరేకంగా సమరశంఖం పూరించాలని కోరారు.
ఇప్పటికే చాలా ఓపిక పట్టామని, కొత్త రాష్ట్రం, కొత్త పార్టీ అన్న ఆలోచనతో ఎనిమిది నెలల పాటు వేచి చూశామని, అయినా ఇప్పటికీ అధికార తెరాస ఎన్నికల హామీలను తీర్చలేదని, ఇలాంటప్పుడు ప్రజలకు పెద్ద దిక్కు ప్రతిపక్షమేనని, ఈ పాత్రను మనం బాధ్యతగా నిర్వర్తించాలని సూచించారు. అంతకుముందు, సమావేశం ప్రారంభంలో దిగ్విజయ్ సింగ్ సభ్యుల అభిప్రాయాలు తెలుసుకున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ను పూర్తిగా తుడిచిపెట్టాలన్న ఆలోచనతో కేసీఆర్ పని చేస్తున్నారని ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ చెప్పారు. వలసలను ప్రోత్సహిస్తూ అప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై దిగ్విజయ్ పైవిధంగా స్పందించారు.
దిగ్విజయ్ సింగ్
టీఆర్ఎస్లోకి కాంగ్రెస్ నుంచి వలసలు పెరగడం గురించి ప్రస్తావన రాగా, దిగ్విజయ్ అసహనం వ్యక్తం చేశారు. వారిపై ఎందుకు పార్టీపరంగా క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఎవరైనా పార్టీని వీడుతున్నారని తెలిస్తే వారితో చర్చలు జరపాలని, అవసరమైతే అధిష్ఠానం దృష్టికి తీసుకురావాలని చెప్పారు.
దిగ్విజయ్ సింగ్
త్వరలో ఖాళీ అయ్యే స్థానాలకు జరిగే గ్రాడ్యుయేట్, ఎమ్మెల్యే, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలపై దృష్టి పెట్టాలని సూచించారు. త్వరలో జరిగే జీహెచ్ఎంసీ, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ల ఎన్నికలపైనా కసరత్తును ప్రారంభించాలన్నారు. హైదరాబాద్లో గెలుపు బాధ్యతని గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్కు అప్పగించారు. ఆయన పార్టీ వీడుతున్నట్టు వస్తున్న వార్తలపై ఆయన వివరణ తీసుకొన్నారు.
దిగ్విజయ్ సింగ్
15 రోజుల తర్వాత మళ్లీ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించుకుందామని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు అయినప్పటికీ రుణమాఫీని పూర్తిగా అమలు చేయలేకపోయిందని దిగ్విజయ్ మీడియాతో అన్నారు. ఎంతో ఆర్భాటం చేసి అధికారంలోకి వచ్చిన బీజేపీ యూటర్న్ తీసుకుందన్నారు. కాంగ్రెస్ పార్టీని చూసి బీజేపీ భయపడుతున్నదని పొన్నాల లక్ష్మయ్య అన్నారు.
దిగ్విజయ్ సింగ్
కొంతమంది నేతలు పొన్నాల లక్ష్మయ్యపై దిగ్విజయ్సింగ్కు ఫిర్యాదు చేశారు. సమీక్షల కోసం వేసిన 8 కమిటీల్లో సీనియర్ నేతలను కాదని, జూనియర్లను నియమించారని ఆరోపించారు. పైగా టీపీసీసీ కార్యదర్శులు, ఇతర పదవుల్లో పార్టీ సిద్ధాంతాలు తెలియనివారిని నియమిస్తున్నారని ఫిర్యాదు చేశారు.