సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయంతో కాలగర్భంలో కలిసిపోయిన గృహ నిర్మాణ శాఖ; కారణం ఇదే!!
తెలంగాణ రాష్ట్రంలో గృహ నిర్మాణ శాఖ కథ కంచికి చేరింది. ఎన్నో దశాబ్దాల పాటు పేదల గృహ నిర్మాణాలతో, పేదవారికి పెన్నిధిగా నిలిచిన గృహ నిర్మాణ శాఖ విషయంలో ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో ఆ శాఖ కనుమరుగయింది. రోడ్లు భవనాల శాఖలో గృహ నిర్మాణ శాఖను విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేశారు.
తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రాభవాన్ని కోల్పోయిన గృహ నిర్మాణ శాఖ
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గృహ నిర్మాణ శాఖ పరిధిలో ఉన్నటువంటి హౌసింగ్ కార్పొరేషన్, హౌసింగ్ బోర్డ్, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్, హౌసింగ్ బోర్డుకి అనుబంధంగా ఏర్పాటైన డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మొత్తంగా రోడ్లు భవనాల శాఖ పరిధిలోకి వెళ్లిపోయాయి. రాష్ట్రంలో లక్షల మంది పేదలకు ఇళ్ళు నిర్మించిన గృహ నిర్మాణ శాఖలో అవినీతి ఆరోపణలతో చాలాకాలంగా ఉనికిని కోల్పోతూ వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గృహ నిర్మాణ శాఖలోని ఒక్కొక్క అంతర్గత శాఖ ప్రాభవాన్ని కోల్పోతూ వచ్చింది.
నామ మాత్రంగా మారిన హౌసింగ్ కార్పోరేషన్, రాజీవ్ స్వగృహ కార్పోరేషన్
మొదట్లో పేదలకు సంబంధించిన డబల్ బెడ్ రూమ్ పథకాన్ని హౌసింగ్ కార్పొరేషన్ నిర్వహించింది. ఇక దాని ఆధ్వర్యంలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో సీఎం కేసీఆర్ దీనిపై ఏసీబీ తో విచారణకు ఆదేశించి ఆ శాఖలోని ఉద్యోగులను ఇతర కార్పోరేషన్లు, శాఖల పరిధిలోకి మార్చారు. దీంతో హౌసింగ్ కార్పొరేషన్ నామమాత్రంగా మారింది.
ఇక అల్పాదాయ వర్గాలకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన రాజీవ్ స్వగృహ పథకం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎటువంటి గృహ నిర్మాణ కార్యకలాపాలు చేపట్టకపోవడంతో, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ నామమాత్రంగా మారింది.
తెలంగాణా ఏర్పాటు తర్వాత అనేక కీలక నిర్ణయాలు
హౌసింగ్ బోర్డ్ కింద తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎటువంటి నిర్మాణాలు జరగలేదు. ఇక స్వగృహ ఆస్తులను వేలం వేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హౌసింగ్ కార్పొరేషన్, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్, నామమాత్రంగా మారడంతో ఉద్యోగులను కూడా ఇతర శాఖలకు బదిలీ చేశారు. ఎన్నికల ప్రధాన హామీలలో గృహ నిర్మాణం ఒకటి కావడంతో హౌసింగ్ బోర్డ్ మాత్రం కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు .
ఇక పోలీస్ సిబ్బందికి ఇల్లు నిర్మించే పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్, వైద్యరోగ్య సిబ్బందికి ఇల్లు నిర్మించే కార్పొరేషన్లను ఆర్ అండ్ బి శాఖ పరిధిలోకి తీసుకురానున్నట్టు సమాచారం.రాష్ట్రం విడిపోయిన తర్వాత హౌసింగ్ బోర్డ్ ఆస్తులు రెండు రాష్ట్రాల మధ్య పంపకాలు జరిగాయి. ఈ పంపకాలలో తెలంగాణ రాష్ట్రానికి 900 కోట్ల అప్పులు వచ్చాయి. ఈ అప్పుల నేపథ్యంలో క్రమంగా స్వగృహా ఆస్తులను ప్రభుత్వం వేలం వేస్తుంది.
కాలగర్భంలో కలిసిపోయిన గృహ నిర్మాణ శాఖ
పేదలకు ఇల్లు నిర్మించి ఇచ్చే పథకం మొదట్లో సంక్షేమ శాఖ అధీనంలో ఉండేది. ఆ తర్వాత కార్మిక శాఖ మంత్రిగా ఉన్న పీ జనార్దన్ రెడ్డి ప్రత్యేకంగా గృహ నిర్మాణ శాఖను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి అంగీకరించడంతో గృహ నిర్మాణశాఖ ప్రత్యేక శాఖగా ఏర్పాటయింది.
ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వివిధ విభాగాలు, కార్పొరేషన్లతో విస్తరించి పేదలు, మధ్య తరగతి వర్గాలకు ఇళ్ళు నిర్మించి ఇచ్చిన గృహ నిర్మాణ శాఖ ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయంతో కాలగర్భంలో కలిసిపోయింది. గృహ నిర్మాణ శాఖను ఆర్ అండ్ బి లో విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఎంతో చరిత్ర ఉన్న గృహ నిర్మాణ శాఖ కథ కంచికి చేరింది.