మోడీతో కేసీఆర్ ఆ ఒక్కమాట!.. ఏ సలహాలిచ్చి మెప్పించారు?
కేసీఆర్ ముక్కు సూటిగా మాట్లాడే తీరు మోడీని సైతం ఆకట్టుకుందనేది ప్రస్తుతం బలంగా వినిపిస్తున్న వాదన.
న్యూఢిల్లీ: రాజకీయాలంటేనే అనిశ్చితికి మారుపేరు. కేంద్రంలో అయినా.. రాష్ట్ర రాజకీయాల్లో అయినా తెల్లారేసరికే.. పొలిటికల్ సీన్లు పూర్తిగా మారిపోయిన పరిస్థితులు అనేకం కనిపిస్తాయి. అందుకే రాజకీయాల పట్ల స్థిరాభిప్రాయాలను ఏర్పరుచుకోవడం ఒక పట్టాన కుదరని పని. ఇప్పుడీ చర్చంతా ఎందుకంటే.. ఒకప్పుడు ప్రధాని మోడీని బహిరంగ వేదికల మీదనే విమర్శించిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇప్పుడాయనకు దగ్గరవుతున్న పరిస్థితులు కనిపిస్తుండడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం.
నోట్ల రద్దు తర్వాత.. ఆ విషయంలో తొలి సీఎం కేసీఆర్ :
నోట్ల రద్దు తర్వాత పరిణామాలపై చర్చించడానికి ప్రధాని మోడీ సీఎం కేసీఆర్ ను ఆహ్వానిస్తారని ఎవరూ ఊహించలేదు. పెద్ద నోట్లను రద్దు నిర్ణయం ప్రకటించిన తర్వాత ప్రధాని మోడీని కలిసిన తొలి సీఎం కేసీఆర్ కావడం విశేషం. ఈ సందర్బంగా.. కేసీఆర్ నుంచి మోడీ సలహాలు-సూచనలు స్వీకరించినట్టుగా తెలుస్తోంది.
మోడీతో సూటిగా కేసీఆర్.. ఆ ఒక్క మాట:
తాజా భేటీ కన్నా ముందు గతంలో ఓసారి ప్రధాని మోడీని కలిసిన సమయంలో.. కేసీఆర్ మోడీతో చెప్పిన ఓ మాట ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 'మోడీ సాబ్.. రెండున్నరేళ్ల పాలనలో మీ మార్క్ పాలన కనిపించలేదు.. మోడీ అంటే ఇది అనేలా ఒక్క నిర్ణయం కూడా లేదు' అంటూ గతంలో మోడీతో చెప్పారట కేసీఆర్.కేసీఆర్ ముక్కు సూటిగా మాట్లాడే తీరు గురించి అందరికీ తెలిసిందే. ఇదే మాటతీరు మోడీని సైతం ఆకట్టుకుందనేది ప్రస్తుతం బలంగా వినిపిస్తున్న వాదన. ఆమధ్య ఒకటి రెండుసార్లు నల్లధనం గురించి కూడా మోడీకి కొన్ని సలహాలు ఇచ్చారట కేసీఆర్. ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే కేసీఆర్ ను మోడీ భేటీకి ఆహ్వానించారని చెప్పుకుంటున్నారు.
మోడీ కేసీఆర్ను పక్కకు ఎందుకు పిలిచారు?
కేసీఆర్ను మోడీ ఢిల్లీకి పిలిచారంటే.. ఇదంతా మామూలే అన్నవారు లేకపోలేదు. అయితే ఈమధ్య డీజీపీల సదస్సు కోసం మోడీ హైదరాబాద్ లో అడుగుపెట్టిన సందర్భంలో.. ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకోవడంతో.. వీరిద్దరి మధ్య బంధం బలపడుతుందనే ఊహాగానాలు మరింతగా పెరిగాయి.మోడీకి స్వాగతం పలకడానికి కేసీఆర్ శంషాబాద్ విమానశ్రయానికి వెళ్లగా.. స్వాగత కార్యక్రమం అనంతరం కేసీఆర్ ను మోడీ పక్కకు పిలిపించుకుని మాట్లాడడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మోడీ-కేసీఆర్ మధ్య ఈ సాన్నిహిత్యానికి ఏదో ప్రత్యేకత ఉండి తీరుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మోడీకి ఏం సలహాలిచ్చి ఉంటారు?
మిత్రపక్షం కాకపోయినా మోడీకి కేసీఆర్ దగ్గరవడానికి కారణం.. కేసీఆర్ రాజకీయ చతురతే అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. నోట్ల రద్దు పరిణామాలపై తన వాక్చుతుర్యంతో ప్రధానిని మెప్పించడంలో కేసీఆర్ సఫలమయ్యారన్నేది చాలామంది వాదన. మోడీ నిర్ణయం పట్ల దేశ ప్రజలు ఎలా స్పందిస్తారు.. నగదు రహిత లావాదేవీల కోసం ప్రజలను ఎలా సంసిద్దం చేయాలి వంటి అంశాలపై విలువైన సలహాలు ఇచ్చారట కేసీఆర్.అందుకే హైదరాబాద్ వచ్చిన సందర్బంలోను.. కేసీఆర్ను పక్కకు పిలిపించుకుని మరీ మోడీ ముచ్చటించారట. ఆయన ఆలోచనలకు అనుగుణంగానే నగదు రహిత నియోజవర్గంగా సిద్దిపేటను తీర్చిదిద్దే పనిలో ప్రస్తుతం కేసీఆర్ నిమగ్నమైన సంగతి తెలిసిందే.
ఫైనల్ మాట ఏంటంటే..!
మొత్తానికి మోడీతో సాన్నిహిత్యం పెంచుకోవడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారన్నది వాస్తవం. భవిష్యత్తులో ఈ బంధం ఏ రకమైన రాజకీయాలకు దారి తీస్తుందనేది ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం. రానున్న రోజుల్లో దీనికి సంబంధించి మరింత స్పష్టత వచ్చే అవకాశముంది.