రేవంత్ రెడ్డిని ఎంతకు కొన్నారు ?కొండాకు ఎంతిచ్చారు? కాంగ్రెస్ పై కేటీఆర్ ఎదురుదాడి
కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ లోకి పార్టీ మారుతామని ప్రకటించిన ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు టిఆర్ఎస్ పార్టీ ప్రలోభాలకు గురిచేసి తమ పార్టీ నేతలను కొనుగోలు చేస్తుందంటూ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నేతల ఆరోపణలపై ఘాటుగా స్పందించిన టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎదురుదాడికి దిగారు.
కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు పలువురు ఆ పార్టీకి గుడ్బై చెప్పి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ తరుణంలో టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో సీఎం కేసీఆర్ తమ ఎమ్మెల్యేలను లాక్కుంటున్నారని, ప్రలోభాలకు గురి చేసి కొనుగోలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ రేవంత్రెడ్డిని ఎంతకు కొన్నారు..? ఎన్నికలకు ముందు పార్టీ ఫిరాయించిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి ని, కొండా దంపతులను, టిఆర్ఎస్ గుర్తు పై విజయం సాధించిన ఎమ్మెల్సీల భూపతిరెడ్డి ,యాదవ రెడ్డి లను కాంగ్రెస్ పార్టీఎంతకు కొనుగోలు చేసిందో చెప్పాలంటూ ప్రశ్నించారు.
రాజకీయాల్లో పార్టీ మారటం తప్పుకాదని చెప్పిన కేటిఆర్ కాంగ్రెస్ నేతలవి దురహంకార మాటలన్నారు . ఒకటికి నాలుగుసార్లు ఆలోచించుకుని మాట్లాడాలని , ప్రజల్లో రాజకీయ వ్యవస్థను మనమే దిగజారుస్తున్నామని మండిపడ్డారు. కాంగ్రెస్లో చేవచచ్చిందని స్వయంగా రాజగోపాల్రెడ్డి చెప్పారన్న కేటీఆర్ మాదారి మేమే వెతుక్కుంటామని రాజగోపాల్రెడ్డే చెప్పారని ఎద్దేవా చేశారు . టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు కూడా పార్టీ మారారని గుర్తు చేసిన కేటిఆర్ తమ ప్రాంతాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలు పార్టీ మారాలని నిర్ణయించుకుంటే పార్టీ మారితే అమ్ముడుపోయినట్లు గా మాట్లాడటం సరైనది కాదని ఆయన కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. ఆరోపణలు చేసే సమయంలో ఒకసారి ఆలోచించుకుని ఆరోపణలు చేయాలంటూ కాంగ్రెస్ నేతలకు హితవు పలికారు.