Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీఆర్ఎస్ విలీనం, సెక్షన్ 8, హైదరాబాద్‌పై తర్జనభర్జన: జైరాం ఆసక్తికర విషయాలు

హైదరాబాద్: జైరాం రమేశ్... ఈ పేరు తెలుగువారి బాగా సుపరిచితం. ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియలో, చట్టం రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు. ఏపీ విభజన ప్రక్రియలో అన్నీ తానై ముందుండి నడపించాడు. ఆనాటి ముచ్చట్లు, చోటు చేసుకున్న ఆసక్తికర అంశాలపై 'ఓల్డ్‌ హిస్టరీ-న్యూ బయోగ్రఫీ' (పాత సంగతులు-కొత్త సరిహద్దులు) పేరిట రాష్ట్ర విభజనపై పుస్తకం రచించారు.

ఈ పుస్తకంలో ఏపీ విభజన సమయంలో తీసుకున్న కీలక నిర్ణయాలు, హైదరాబాద్ విషయంలో తర్జనభర్జన పడిన విషయాన్ని క్లుప్తంగా వివరించారు. తెలంగాణ ప్రజల సంస్కృతి-వారసత్వం హైదరాబాద్ నగరంతోనే ముడిపడి ఉంది. ఏపీ రాజధాని కావడం, భూములు అందుబాటులో ఉండటంతో హైదరాబాద్‌కు 1950 దశకం మధ్యనుంచే పెట్టుబడులు పెరిగాయి.

తెలుగు సినీ పరిశ్రమ కూడా ఇక్కడే ఉంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న హయాంలో 1996-2003 మధ్య బాగా అభివృద్ధి జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన వైయస్ కూడా దీనిని కొనసాగించారు. ఉమ్మడి ఏపీకి హెచ్‌ఎండీఏ ప్రాంతాలు ఆర్థిక వనరుగా మారాయి.

How the Congress lost Andhra Pradesh

కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. సీమాంధ్రులు కూడా హైదరాబాద్‌లో ఎప్పటినుంచో నివసించడం, విభజన తర్వాత తెలంగాణ వారు తమపై దాడులు చేస్తారనే వాదనతో హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలన్న డిమాండ్‌ సీమాంధ్ర నుంచి వచ్చింది. జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ కూడా ఈ అంశంపై సమీక్షించింది.

అయితే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ మాత్రం కొత్త కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేయకూడదని నిర్ణయం తీసుకుంది. దీంతో హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ఉండాలనే ప్రతిపాదనను తిరస్కరించారు. హైదరాబాద్‌ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచేలా నిర్ణయం తీసుకున్నాం.

గవర్నర్ పాత్ర, సెక్షన్ 8

ఉమ్మడి రాజధాని విషయంలో గవర్నర్‌కు ప్రత్యేక పాత్ర కల్పించడానికి తగిన కారణాలు ఉన్నాయి. కేసీఆర్‌తోపాటు టీఆర్‌ఎస్‌ నాయకులు బాగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఇందులో ప్రధానం. 'తెలంగాణ జాగో, ఆంధ్రావాలా బాగో', హైదరాబాద్‌ సిర్ఫ్‌ హమారా' వంటి నినాదాలు... తెలంగాణ ఏర్పడిన తర్వాత 'చూసుకోవాల్సిన' సీమాంధ్ర ఉద్యోగులను గుర్తించామని తెలంగాణ జేఏసీ ప్రకటించడం వంటివి మా దృష్టికి వచ్చాయి.

దీంతో సెక్షన్ 8 అనే అంశం తెరపైకి వచ్చింది. సెక్షన్‌8పై షిండే, చిదంబరంతోపాటు కేసీఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినప్పటికీ... హైదరాబాద్‌లో నివసించే వారిలో మరీ ముఖ్యంగా కోస్తాప్రాంతం నుంచి వచ్చిన వారిలో విశ్వాసం నెలకొల్పేందుకు, భరోసా ఇచ్చేందుకు ఈ చర్య అవసరమని అప్పట్లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీఎంవో) భావించింది.

''యూపీఏ ప్రభుత్వం 2004లో ఏర్పడింది. మే 16న సోనియా నివాసంలో కూటమి నేతలం కలిశాం. కనీస ఉమ్మడి కార్యక్రమంలో 'త్వరలోనే తెలంగాణ ఏర్పాటు' విస్పష్టంగా ఉండాలని కేసీఆర్‌ పట్టుబట్టారు. కానీ... కాంగ్రె‌స్‌తోపాటు సీపీఎం వంటి పార్టీలు కుదరదని అన్నాయి. నాకూ ఇబ్బందిగానే అనిపించింది. ప్రత్యామ్నాయాలపై కసరత్తు చేసినా కుదరలేదు.

దీంతో కాంగ్రెస్‌లో దిగ్గజ 'డ్రాఫ్ట్స్‌మన్‌' ప్రణబ్‌ ముఖర్జీతో గంటలకొద్దీ గడిపాను. ఏంచేసినా తెలంగాణపై కేసీఆర్‌ వెనక్కి తగ్గలేదు. ప్రొఫెసర్‌ జయశంకర్‌తో భేటీ ఏర్పాటు చేయించారు. చివరికి... నేను, ప్రణబ్‌ కలిసి కేసీఆర్‌తో చర్చించి, 'ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును ప్రభుత్వం తగు సమయంలో, తగిన సంప్రదింపులు, విస్తృత ఏకాభిప్రాయం మేరకు పరిశీలిస్తుంది'' అని చేర్చాం.

టీఆర్ఎస్ విలీనం
తెలంగాణ ఇచ్చాక 2014 ఎన్నికలకుముందే టీఆర్‌‌ఎస్‌ విలీనమవుతుందని కాంగ్రెస్‌ పార్టీ ఆశించింది. ఇందుకు చాలా కారణాలున్నాయి. ఏపీని విభజించాం కాబట్టి సీమాంధ్రలో కాంగ్రెస్ విజయావకాశాలు లేవు... వైసీపీ బలపడుతోంది. కనీసం తెలంగాణలోనైనా బలాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్‌ ప్రయత్నించింది.

విభజనతో ఎన్నికల్లో లబ్ధి తథ్యమని అధిష్ఠానాన్ని ఆజాద్‌ ఒప్పించారు. విభజన తర్వాత రెండు రాష్ట్రాలు కలిసిమెలిసి సాగేందుకు ఒక వ్యవస్థ అవసరమని భావించాను. అందుకే ఉమ్మడి గవర్నర్‌ ప్రతిపాదన తెచ్చాను. మంత్రుల బృందంలో అందరి మద్దతూ లభించింది. ఉమ్మడి రాజధానిలో పదేళ్లు గవర్నర్‌ పాత్ర కీలకమని జీవోఎం అభిప్రాయపడింది.

వివాదాలొస్తే ప్రతిసారీ కేంద్రం జోక్యం చేసుకోవడం కుదరదు కాబట్టి రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 371-హెచ్‌ గురించి సీనియర్‌ నేత జైపాల్‌ రెడ్డి నా దృష్టికి తెచ్చారు. గవర్నర్‌ పాత్రను దీని ప్రకారం నిర్వచించవచ్చునని ఓ పరిష్కార మార్గం చూపించారు. ఇక రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపకం చాలా కీలకం. దీన్ని దృష్టిలో పెట్టుకునే... కృష్ణా, గోదావరి బోర్డులను ప్రతిపాదించాను.

అలాగే... కేంద్ర జలవనరుల మంత్రి ఆధ్వర్యంలో ఇద్దరు సీఎంలు, ఇతరులు సభ్యులుగా అపెక్స్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేయాలని సూచించాను. జీవోఎం పని ముగిసి బిల్లు తయారైంది. ఇది పార్లమెంటు ఆమోదం పొందడమే మిగిలింది. దీనిపై 2014 ఫిబ్రవరి 12న ప్రధాని మన్మోహన్‌ బీజేపీ నేతలతో సమావేశం నిర్వహించారు.

'ఆమోదానికి సహకరిస్తాం. కానీ... ఎలాంటి గందర గోళం తలెత్తకూడదు' అని బీజేపీ నేతలు షరతుపెట్టారు. ఆ మరుసటి రోజున లోక్‌సభలో బిల్లు పెట్టేందుకు హోంమంత్రి లేవగానే అప్పటి విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ దూసుకెళ్లి పెప్పర్‌ స్ర్పే చల్లారు.

టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి సెక్రటరీ టేబుల్‌పై అద్దాన్ని బద్దలుకొట్టి, మైకును విరగ్గొట్టారు. పెప్పర్‌ స్ర్పేవల్ల చాలామంది అస్వస్థతకు గురయ్యారు. గంట తర్వాత సభ మళ్లీ సమావేశమైంది. 16మంది సీమాంధ్ర ఎంపీలను సస్పెండ్‌ చేశారు. ఈ ఘటనలతో దిగ్ర్భాంతికి గురయ్యాను.

బిల్లు ప్రవేశపెట్టినట్లేనని హోంమంత్రి, అసలు అజెండాలోనే లేదని విపక్ష నేత సుష్మాస్వరాజ్‌ ప్రకటించారు. అయితే... చర్చకు అనుమతించే అధికారం స్పీకర్‌కు ఉందని కమల్‌నాథన్‌ చెప్పారు. ఇక ఫిబ్రవరి 17న నేను, చిదంబరం కలిసి ఆడ్వానీ గదికి వెళ్లాం. సుష్మా స్వరాజ్‌, అరుణ్‌జైట్లీ, వెంకయ్య కూడా అక్కడ ఉన్నారు.

ఆ మరుసటి రోజున (2014 ఫిబ్రవరి 18) విభజన బిల్లు ప్రవేశపెడతామని సమాచారమిచ్చాం. ఈ సందర్భంలో సీమాంధ్ర ప్రయోజనాలు కాపాడాలని... బిల్లు సాఫీగా ఆమోదం పొందేలా చూడాలని వెంకయ్య కోరారు. బిల్లులో పేర్కొన్నట్లుగా గవర్నర్‌ పాత్ర ఉండాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని జైట్లీ చెప్పారు.

దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఆ తర్వాత నేను జైట్లీకి ఈమెయిల్‌లో పంపాను. దీంతో పార్లమెంట్‌లోని ఉభయసభల్లో ఏపీ విభజన బిల్లు ఆమోదం పొంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మార్గం సుగమనమైంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+