కోదండరాంకు కౌంటర్, తలసాని ఎఫెక్ట్: టిఆర్ఎస్లో భిన్నరాగం?
హైదరాబాద్: గత రెండేళ్లలో విపక్షాలు కేసీఆర్ పాలన పైన దుమ్మెత్తిపోశాయి. ఆయా సందర్భాల్లో తెరాస నేతలు, మంత్రులు ఒకింత ధీటుగానే స్పందించారు. కానీ, ఇటీవల తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం పైన మాత్రం వారు మూకుమ్మడిగా మాటల దాడి చేసారు.
తెలంగాణలో విపక్షాలకు పెద్దగా పట్టు లేదు. తెలంగాణ సెంటిమెంటు కారణమో మరో కారణమో కానీ ఇప్పటికీ తెరాసదే హవా. ప్రతిపక్షాలకు ప్రజల నుంచి కనీస మద్దతు కూడా కనిపించడం లేదు. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో తెరాస సత్తా చాటింది.
కానీ, కోదండరాం వ్యాఖ్యలతో మాత్రం దాదాపు తొలిసారి కేసీఆర్ ప్రభుత్వం ఇబ్బంది పడింది. దీంతో, నేతలు అందరూ అతని పైన ఎదురు దాడికి దిగారు. కోదండ పైన ఎదురు దాడి చేయవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినట్లుగా వార్తలు రావడం వేరే విషయం.
ఇదిలా ఉండగా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న హరీష్ రావు, ఈటెల రాజేందర్ వంటి మంత్రులు, లేదా ఇతర నేతలు కోదండరాంపై ఎదురు దాడి దిగడంపైన చర్చ జరగడం లేదు కానీ, నిన్నటి దాకా టిడిపిలో ఉండి, ఆ తర్వాత తెరాసలోకి వచ్చి మంత్రి పదవులు దక్కించుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి నేతలు కోదండ పైన మాట్లాడటంపై టిఆర్ఎస్లోనే చర్చ జరుగుతోందని అంటున్నారు.
తలసాని, కడియం శ్రీహరి వంటి నేతలు కోదండరాంను విమర్శించడంపై విపక్ష నేతలు మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వారు కూడా కోదండరాంను విమర్శించడం సిగ్గుచేటు అన్నారు. తలసాని వంటి నేతల వ్యాఖ్యలను జేఏసీ కూడా తీవ్రంగానే పరిగణిస్తోందని అంటున్నారు.
తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలు మారి మంత్రులుగా మారారని విపక్షాలు మండిపడుతున్నాయి. అలాంటి వాళ్లు కోదండరాంను విమర్శించడం విడ్డూరమని అంటున్నారు.
ఉద్యమంలో పాల్గొనని నేతలు కూడా కోదండ పైన విరుచుకుపడటం అంటే పార్టీకి నష్టమేనని తెరాసలోనే కొందరు చెవులు కొరుక్కుంటున్నారని తెలుస్తోంది. అయితే, ఉద్యమం విషయం పక్కన పెడితే, పక్కా రాజకీయ పార్టీగా తెరాస మారిందని, కాబట్టి చేతల ప్రభుత్వాన్ని విమర్శిస్తే తలసానికి మాట్లాడే హక్కు ఉందనే వారు కూడా లేకపోలేదు.