సికింద్రాబాద్ విధ్వంసం: సుమోటోగా స్వీకరించిన హెచ్ఆర్సీ; చట్టవిరుద్ధంగా కాల్పులు జరిపారన్న పౌరహక్కుల సంఘం!!
అగ్నిపథ్ పథకంపై చెలరేగిన ఆందోళనలలో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 13 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇక ఈ ఘటనలో రైల్వే కు సంబంధించి దాదాపు 12 కోట్ల ఆస్తి నష్టం సంభవించిందని సమాచారం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం ఘటనను సీరియస్ గా తీసుకున్న రైల్వే పోలీసులు ఈ కేసుకు సంబంధించి పలువురిని అరెస్ట్ చేసి, సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రైల్వే స్టేషన్ విధ్వంసం వెనుక ఉన్న సూత్రధారులను కూడా అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇదిలా ఉంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసంపై మానవహక్కుల కమిషన్ స్పందించింది.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం .. సుమోటోగా కేసు స్వీకరించిన మానవ హక్కుల కమీషన్
వివిధ ప్రసార మాధ్యమాలలో వచ్చిన కథనాలపై సుమోటోగా కేసును స్వీకరించి దర్యాప్తు చేయనుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో సంభవించిన విధ్వంసంలో ఒకరు మరణించడం, 13 మంది తీవ్ర గాయాల పాలు కావడంతో పాటు, రైల్వే కు సంబంధించిన ఆస్తి నష్టం పై జూలై 20వ తేదీ లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, జిఆర్పి డీజీ లను మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది.

రైల్వే పోలీసులు చట్ట విరుద్ధంగా కాల్పులు జరిపారు: పౌర హక్కుల సంఘం
ఇదిలా ఉంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళన చేసిన అభ్యర్థులపై రైల్వే రక్షణ దళం పోలీసులు చట్టవిరుద్ధంగా కాల్పులు జరిపారని పౌరహక్కుల సంఘం ఆరోపిస్తోంది. కాళ్ళకింద కాల్చాలని నిబంధన ఉన్నా దానిని పాటించకుండా నేరుగా ఛాతీపై, తలపై ఫైరింగ్ చేయడం ఏమిటని పౌర హక్కుల సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నేతృత్వంలోని నిజనిర్ధారణ కమిటీ ఆదివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను పరిశీలించి ఆర్పిఎఫ్, జిఆర్పి పోలీసుల నుండి అన్ని వివరాలను సేకరించారు.

రాకేష్ కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్
ఆందోళనలను అదుపులోకి తీసుకు రావాలన్న నెపంతో రాకేష్ పై కాల్పులు జరపడాన్ని పౌర హక్కుల సంఘం తీవ్రంగా ఖండించింది. అగ్నిపథ్ పేరుతో సైనికుల నియామక పద్ధతి ఒక్కసారిగా మార్చటం అప్రజాస్వామికం అని పౌర హక్కుల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. కాల్పుల ఘటనపై స్వయంప్రతిపత్తి గల సంస్థతో దర్యాప్తు చేయించాలని, ఆర్మీ అభ్యర్థులపై అక్రమంగా బనాయించిన కేసులను ఎత్తివేయాలని, మరణించిన రాకేష్ కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది.

ఆర్మీ అభ్యర్థి మృతి ఘటనపై రైల్వే అధికారుల పశ్చాత్తాపం
ఇదిలా ఉంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో కాల్పులలో వరంగల్ కు చెందిన రాకేష్ అనే ఆర్మీ ఉద్యోగ అభ్యర్థి చెందడం, మరో 13 మంది గాయపడిన ఘటనపై రైల్వే అధికారులు పశ్చాత్తాప పడుతున్నట్టు సమాచారం. ముందుగా హెచ్చరించి ఆ తరువాత కాల్పులు జరిపి ఉండాల్సిందని వారు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక కాల్పులకు దారి తీసిన పరిస్థితులపై సమగ్ర విచారణకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆర్పిఎఫ్ పోలీసులు ఈ మేరకు చర్యలు ప్రారంభించారు. అయితే కాల్పులు జరపకుండా సంయమనం పాటించాల్సింది అని ఆర్పిఎఫ్ బలగాలతో ఉన్నతాధికారులు చెప్పినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications