తొలిసారి ‘గుండె’ను తరలించిన హైదరాబాద్ మెట్రో: ఎల్బీనగర్-జూబ్లీహిల్స్కు 30 నిమిషాల్లోనే
హైదరాబాద్: ఎప్పుడూ రోడ్డు మార్గం ద్వారానే అత్యవసరమైన అవయవాల రవాణా ఓ ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి జరుగుతుండేది. కానీ, తొలిసారి హైదరాబాద్ మెట్రో రైలును గుండె మార్పిడి శస్త్రచికిత్స కోసం ఉపయోగించారు. నగరంలో ట్రాఫిక్ తీవ్రంగా పెరిగిపోయిన నేపథ్యంలో అత్యవసరంగా గుండె తరలింపునకు హైదరాబాద్ మెట్రోను ఎంచుకున్నారు వైద్యులు.
జూబ్లీహిల్స్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స
జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో గుండె మార్పిడి శస్త్ర చికిత్సకు వైద్యులు ఏర్పాట్లు చేశారు. డాక్టర్ గోకులే నేతృత్వంలోని ఆపరేషన్ జరగనుంది. ఈ క్రమంలో తొలిసారిగా హైదరాబాద్ మెట్రోలో గుండె తరలింపునకు అధికారులు సిద్ధమయ్యారు. ఆస్పత్రి సిబ్బంది మెట్రో రైలు అధికారులకు సమాచారం అందించారు. దీంతో మెట్రో అధికారులు కూడా అందుకు తగిన ఏర్పాట్లు చేశారు.
ఎల్బీనగర్ నుంచి జూబ్లీహిల్స్కు గుండె..
ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్ అపోలోకు గుండెను ఎలాంటి ఆటంకాలు లేకుండా తరలించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీంతో మంగళవారం ఆ గుండె అపోలో ఆస్పత్రికి సురక్షితంగా చేరుకుంది. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు నుంచి అపోలో ఆస్పత్రి వరకు రోడ్డుపై గ్రీన్ ఛానల్ ద్వారా గుండెను తరలించారు.
నర్సిరెడ్డి అనే రైతు గుండె మరొకరికి..
అధిక ట్రాఫిక్ సమస్య కారణంగానే తాము మెట్రో రైలును ఎంచుకున్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, నల్గొండ జిల్లాకు చెందిన నర్సిరెడ్డి అనే 45 ఏళ్ల రైతు బ్రెయిన్ డెడ్ అయ్యింది. దీంతో అతడి గుండెను దానం చేసేందుకు ఆయన కుటుంబసభ్యులు ముందుకు వచ్చారు. దీంతో ఆ గుండెను మరొకరికి శస్త్రచికిత్స ద్వారా అమర్చేందుకు వైద్యులు ఏర్పాట్లు చేశారు.
21 కిలోమీటర్లు 30 నిమిషాల్లోనే..
కాగా, మొత్తం 21 కిలోమీటర్లు 16 మెట్రో స్టేషన్లు దాటుకుని కేవలం 30 నిమిషాల్లోనే ఆ గుండె ఎల్బీనగర్ నుంచి జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి చేరింది. జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక అంబులెన్స్ ద్వారా గుండెను ఆస్పత్రికి చేర్చారు. దీంతో గుండె మార్పిడి శస్త్ర చికిత్స నిర్వహించారు. గుండె తరలింపునకు సహకరించిన వారందరికీ వైద్యులు కృతజ్ఞతలు తెలిపారు.