కరోనా ఆంక్షలు.. బంద్ సమయంలో భోజన కష్టాలు..!మానవత్వం చాటుకుంటున్న సాటి మనుషులు..!
హైదరాబాద్/అమరావతి : కరోనా మహమ్మారి దేశ ప్రజల మీద స్వైర విహారం చేసేందుకు సై అంటోంది. ఈ ప్రాణాంతక వ్యాధి దేశంలో ప్రబలకుండా ఉండేందుకు దేశ ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ లాక్ డౌన్ ఆంక్షలకు కట్టుబడి ఉండాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆంక్షలను కఠినతరం చేస్తూ ప్రజలను బాహ్యప్రంపంచంలోకి రానివ్వకుండా నియంత్రిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆకలితో అలమటిస్తున్న వారి పట్ల కొంత మంది తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.
అన్నదాతా సుఖీభవ... నిరుపేదలకు ఉచిత భోజనం అందిస్తున్న మనవతావాదులు..
కొన్ని చోట్ల రాజకీయ నాయకులు నిరుపేదలకు భోజనాలు అందిస్తుంటే మరికొన్ని ప్రదేశాల్లో కొంత మంది తమ సొంత ఖర్చులతో అభాగ్యులకు భోజనాలు అందిస్తూ క్లిష్ట సమయంలో వారి ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రజల దగ్గర ఉన్న ప్రధాన ఆయుధం స్వీయ నియంత్రణ. సమూహాలుగా ఏర్పడితే కరోనా వేగవంతంగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి ప్రజలు గుంపులుగా ఏర్పడవద్దన్నది ప్రధాన లక్ష్యం. ఇందులో భాగంగా ప్రజలు గుంపులుగా ఏర్పడకుండా, ఒకరితో మరోకరికి ప్రత్యక్ష సంబంధాన్ని నిషేదిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వీయ నియంత్రణకు ఆదేశాలు జారీ చేసాయి.
అన్నీ బంద్.. రెక్కాడితే గాని డొక్కాడని పేదలకు ఎన్నో కష్టాలు..
బస్సులు, రైళ్లు, ఆటోలు, గుడులు, బడులు, వ్యాపార కేంద్రాలు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, మెస్సులు, క్లబ్బులు, పబ్బులు చివరకు టీ అమ్ముకునే చిరు వ్యాపారుల పట్ల కూడా నిషేదాన్ని విధించాయి ప్రభుత్వాలు. దీంతో జన జీవన స్రవంతి చాలా వరకు నిలిచిపోయినట్టైంది. ఇక్కడే ఓ విపత్కర సమస్య తెర మీదకు వచ్చినట్టు తెలుస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద ప్రజల జీవనం మాత్రం మృగంగా మారిపోయింది. ఎటూ కదలలేని క్లిష్ట పరిస్థితుల్లో వారి జీవనోపాది కష్టంగా మారిపోయినట్టు తెలుస్తోంది.
నిరుపేదలకు సంఘీభావం.. సొంత ఖర్చులతో భోజనాలు పెడుతున్న సామాన్యులు..
రోజూవారీ కూలీ చేసుకుని జీవనం వెళ్లదీసే నిరుపేదల పట్ల కరోనా ఘోరంగా కన్నెర్ర చేసినట్టు తెలుస్తోంది. నిత్యావసర సరుకులు కొనలేక, ప్రభుత్వం ఇస్తున్న రాయితీలను అందుకునే సౌలభ్యత లేక, ఇంట్లో వండుకుని తినే వెసులబాటు లేక ఆకలితో చాలా మంది నిరు పేదలు అలమటిస్తున్నట్లు తెలుస్తోంది. వారిని ఆఘమేఘాల మీద గుర్తించి ఆదుకునే ప్రయత్నాలు ప్రభుత్వాలు చేస్తున్నప్పటికి అది సమయం తీసుకునే కార్యక్రమం కాబట్టి నిరుపేద ప్రజలకు ఆకలి కష్టాలు తప్పడం లేదు. సరిగ్గా ఇలాంటి వారికోసమే కొంత మంది తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.
Recommended Video
లాక్ డౌన్ లో నిరుపేదల తిండి కష్టాలు.. మేమున్నామంటున్న సహచరులు..
అన్న దాతా సుఖీభవ అనే నానుడికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం గిరాకీ పెరిగినట్టు ప్రచారం జరుగుతోంది. కరోనా ఆంక్షలు, లాక్ డౌన్ నిబంధనల నేపథ్యంలో తిండికి నోచుకోలేని వారిని కొంత మంది మానవతా వాదులు అక్కున చేర్చుకుంటున్నారు. రాజకీయ నాయకులు ఇలాంటి నిరుపేదలకు భోజన సౌకర్యం కల్పించడం పెద్ద విశేషం కాకపోయినప్పటికి సామాన్య ప్రజలు, తమ అరకొర ఆదాయంలో కొంత ఖర్చు చేస్తూ తిండికి నోచుకోలేని వారికి భోజనం పెడుతుండండం హర్షించదగ్గ పరిణామంగా చర్చ జరుగుతోంది. తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో ఇలాంటి పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. మనుషుల్లో మానవత్వం ఉందనే దిశగా కొంత మంది వ్యవహరిస్తున్న తీరుకు అన్ని వర్గాల ప్రజల నుండి ప్రశంసల ఝల్లు కురుస్తోంది. వన్ ఇండియా తెలుగు కూడా ఇలాంటి మానవతా వాదులకు మన్సూర్తిగా హాట్సాఫ్ చెప్తోంది.