జరగబోయేది కురుక్షేత్ర యుద్ధం-ధర్మానికి అధర్మానికి మధ్య పోరాటం-హుజురాబాద్ టూర్లో గర్జించిన ఈటల
తెలంగాణ ఉద్యమానికి ఆనాడు కరీంనగర్ ఎలాగైతే కేంద్ర బిందువుగా నిలిచిందో... రాష్ట్ర ఆత్మగౌరవ పోరాటానికి హుజురాబాద్ ప్రతీకగా నిలుస్తుందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. జరగబోయేది కురుక్షేత్ర యుద్దమని... పాండవులకు,కౌరవులకు మధ్య యుద్దం జరగబోతుందని చెప్పారు. ఇది ధర్మానికి,అధర్మానికి మధ్య సాగే యుద్ధమన్నారు. టీఆర్ఎస్ పార్టీకి హుజురాబాద్ ఉపఎన్నికలో ప్రజలు కచ్చితంగా బుద్ది చెప్పి తీరుతారని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ సభ్యత్వానికి,ఎమ్మెల్యే పదవికి రాజీనామా తర్వాత మంగళవారం(జూన్ 8) తొలిసారి హుజురాబాద్లో పర్యటించారు ఈటల.
Recommended Video

'బిడ్డా అన్యాయం జరిగింది...'
'బిడ్డా నీకు అన్యాయం జరిగింది... గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకుని కాపాడుకున్న నిన్ను... కష్టకాలంలో ఉద్యమం నడిపిన నిన్ను... ఇప్పుడు ద్రోహులను పక్కనపెట్టుకుని కేసీఆర్ నీకు ద్రోహం చేయడం తగదని ప్రజలు అంటున్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. గొర్రెల మీద తోడేళ్ల మంద తరహాలో మాపై దాడి చేస్తున్నారు. ఎన్ని దాడులు చేసినా,బ్లాక్ మెయిల్ చేసినా ప్రజలను మీరు కొనలేరు. 20 ఏళ్ల చరిత్రలో మిమ్మల్ని మేము గుండెల్లో పెట్టుకున్నాం. ఇప్పుడు కూడా మిమ్మల్నే గెలిపించుకుంటామని హుజురాబాద్ ప్రజలు చెబుతున్నారు.' అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

జరగబోయేది కురుక్షేత్ర యుద్ధం : ఈటల
తెలంగాణ ఉద్యమానికి ఆనాడు కరీంనగర్ కేంద్రబిందువు అయితే... దాన్ని కాపాడుకున్న నియోజకవర్గం ఆనాటి కమలాపూర్ నియోజకవర్గం,ఈనాటి హుజురాబాద్ నియోజకవర్గమని ఈటల అన్నారు. రేపు జరగబోయేది కురుక్షేత్ర యుద్దమని,ధర్మానికి-అధర్మానికి మధ్య సాగే సంగ్రామం అని వ్యాఖ్యానించారు.కురుక్షేత్రం తరహాలోనే పాండవులకు,కౌరవులకు మధ్య హుజురాబాద్లో యుద్ధం జరగబోతుందన్నారు. 20 ఏళ్లుగా టీఆర్ఎస్ పార్టీ జెండా మోసి భంగపడ్డవాళ్లంతా హుజురాబాద్లో తన కోసం ఇంటింటికీ తిరుగుతారని చెప్పారు. నిరుద్యోగులు,విద్యార్థులు,కార్మిక వర్గాలు,హక్కుల కార్యకర్తలు ప్రతీ ఒక్కరూ హుజురాబాద్ యుద్ధంలో పాల్గొంటారని చెప్పారు.

హుజురాబాద్ నుంచే మరొక ఉద్యమం
కొద్దిమంది తొత్తులుగా మారిపోయి అవాకులు చవాకులు పేలుతున్నారని ఈటల ఫైర్ అయ్యారు. ఖబడ్దార్ అంటూ వారిని హెచ్చరించారు. పైనున్న వాళ్లు చెప్పిన మాటలు పట్టుకుని తమను అవమానిస్తే రాజకీయంగా బొంద పెడుతామన్నారు. ఆనాడు కరీంనగర్ తెలంగాణ ఉద్యమానికి కేంద్రబిందువుగా నిలిచిన తరహాలో... ఈనాడు హుజురాబాద్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. అణచివేత నుంచి ప్రజలను కాపాడుకోవడానికి,అణగారిని హక్కుల కోసం,రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు హుజురాబాద్ నుంచే మరొక ఉద్యమం మొదలైందన్నారు. హుజురాబాద్లో తన గెలుపు తెలంగాణ ఆత్మగౌరవ గెలుపు అవుతుందని అభివర్ణించారు. ఎత్తిన పిడికిలి బిగబట్టి ముందుకు నడవమంటూ హుజురాబాద్ ప్రజలు తనకు సంపూర్ణ ఆశీర్వాదం ఇచ్చారని పేర్కొన్నారు.

ఈటల రోడ్ షో...
అంతకుముందు,హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల రోడ్ షో నిర్వహించారు. అనుచరులు,మద్దతుదారులతో కలిసి నియోజకవర్గంలోని శంభునిపల్లి గ్రామం నుండి కమలాపూర్ వరకు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా 'కదిలిందిరా ఈటల సైన్యం' అంటూ అనుచరులు హోరెత్తించారు. పలుచోట్ల మహిళలు మంగళ హారతులతో ఆయనకు స్వాగతం పలికారు. కమలాపూర్లో ఈటల అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈటల పర్యటన దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులను మోహరించారు.












Click it and Unblock the Notifications