హుజురాబాద్ ఉప ఎన్నిక కేసీఆర్ అహంకారాన్ని ఓడించటానికి జరుగుతున్న ఎన్నిక : ఈటల రాజేందర్
తెలంగాణా రాజకీయాల్లో హుజురాబాద్ ఉప ఎన్నికల వేడి కొనసాగుతుంది. హుజురాబాద్ ఉప ఎన్నికలలో విజయం సాధించడం కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిని మించి ఒకరు ఎత్తుగడలతో ముందుకు వెళుతున్నారు. అధికార టీఆర్ఎస్ హుజురాబాద్ లో విజయం సాధించి మళ్లీ గులాబీ జెండా ఎగురవేయాలని యుద్ధ ప్రాతిపదికన మంత్రులను రంగంలోకి దింపి కార్యాచరణ మొదలుపెట్టింది. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ ఉప ఎన్నిక పై ఫోకస్ పెట్టి ఇన్చార్జిల ను నియమించింది. బిజెపి ఏకంగా అగ్రనాయకులని రంగంలోకి దింపి హుజురాబాద్ రాజకీయాలను రసవత్తరంగా మార్చనుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈటల రాజేందర్ హుజురాబాద్ ఉప ఎన్నిక పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నిక న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడుకోవడానికి, అహంకారాన్ని ఓడించడానికి జరుగుతున్న ఉప ఎన్నికగా ఆయన అభివర్ణించారు. అంతేకాదు హుజురాబాద్ లో మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అధికార టీఆర్ఎస్ పై వ్యతిరేకత ఉందని ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. టిఆర్ఎస్ పార్టీ ఎన్ని కోట్లు ఖర్చు చేసినా గెలిచేది మాత్రం బీజేపీ నేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
హుజురాబాద్ లో విపరీతంగా డబ్బు ఖర్చు పెడుతున్న టిఆర్ఎస్ పార్టీ కుల సంఘం భవనాల పేరుతో ప్రజలను మభ్య పెడుతుందని ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా టిఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మబోరని పేర్కొన్న ఈటల రాజేందర్, టిఆర్ఎస్ పార్టీ చేసే చిల్లర రాజకీయాలు తెలంగాణ ప్రజలు అంగీకరించరని స్పష్టం చేశారు. టిఆర్ఎస్ పార్టీ నాయకులకు, ప్రజలలో బలం ఉంటే చిల్లర రాజకీయాలు చేయవలసిన అవసరం ఏంటని ప్రశ్నించారు.
అంతేకాదు ఈటల రాజేందర్ ను కెసిఆర్ మోసం చేశాడని తెలంగాణ ప్రజలందరూ నమ్ముతున్నారని ఆయన స్పష్టం చేశారు. కెసిఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని విమర్శించిన ఈటల రాజేందర్ ఎదురు దాడులకు, చిల్లర దాడులకు భయపడబోమని స్పష్టం చేశారు. యావత్ తెలంగాణ ప్రజలు హుజురాబాద్ ఉప ఎన్నిక వైపు చూస్తున్నారని పేర్కొన్న ఆయన హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఆత్మగౌరవాన్ని గెలిపించుకుందామని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.