Huzurabad By-poll: వీవీ ప్యాట్ల తరలింపుపై భగ్గుమన్న డీకే అరుణ; ఎస్ఈసీకి ఫిర్యాదు
హుజరాబాద్ ఉప ఎన్నికల్లో వీవీ ప్యాట్ లను అక్రమంగా తరలించారని వార్తల నేపథ్యంలో బీజేపీ నేతలు డీకే అరుణ, రాజాసింగ్, ఎన్ రామచంద్రరావు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆమె పేర్కొన్నారు . హుజురాబాద్ లో పోలింగ్ ముగిసిన తర్వాత అక్కడి నుండి స్ట్రాంగ్ రూమ్ కి బయలుదేరిన బస్సులు మార్గమధ్యలో ఓ టిఆర్ఎస్ నాయకుడి హోటల్ ముందు ఎలా ఆపుతారని ప్రశ్నించారు బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.
వీవీప్యాట్లు ఎలా బయటకు వచ్చాయని ప్రశ్నించిన డీకే అరుణ
బస్సు రిపేర్ అయింది అని చెప్పి ఈవీఎం బాక్స్ లను మార్చినట్టు వీడియోలు చూశామని, వివి ప్యాట్లు ఎలా బయటకు వచ్చాయని ప్రశ్నించిన డీకే అరుణ పూర్తి భద్రతతో ఈవీఎంలను తరలించాలి కానీ పోలీసులు లేకుండా ఈవీఎంలను ఎలా తీసుకు వెళతారని ప్రశ్నించారు. ఎలాంటి భద్రతా లేకుండా ఆ బస్సులను అక్కడ ఎందుకు నిలిపివేశారని డి.కె.అరుణ ప్రశ్నించారు. హుజురాబాద్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని అన్ని సర్వేలలో ఎగ్జిట్ పోల్స్ రావడంతో ఈవీఎం బాక్సులను మార్చాలని చూశారని డీకే అరుణ ఆరోపణలు గుప్పించారు.
ఓటమి భయంతోనే వీవీప్యాట్లు తరలింపు
టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, అధికార పార్టీ నాయకులు ఓటుకు ఆరేడు వేల రూపాయల చొప్పున పంచారని ఆమె పేర్కొన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలైతే అధికార టీఆర్ఎస్ ఎందుకు డబ్బులు పంచిందని ప్రశ్నించిన డీకే అరుణ, కేవలం ఒక్క ఉప ఎన్నికకు వందల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టారని ఆరోపించారు. ఓటమి భయంతోనే ఈవీఎంలు, వివి ప్యాట్ లూ మారుద్దామని ఆలోచన చేశారని డీకే అరుణ మండిపడ్డారు. కేవలం డబ్బుతో రాజకీయం చేసే పరిస్థితులు తెచ్చారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు .
హుజురాబాద్ ఉప ఎన్నికపై సీబీఐ విచారణకు ఆదేశం
హుజురాబాద్ ఉప ఎన్నికపై సిబిఐ విచారణ చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ ను కోరామని పేర్కొన్న డీకే అరుణ, ఆయన కూడా సానుకూలంగా స్పందించారని వ్యాఖ్యానించారు. హుజురాబాద్ నియోజకవర్గ ఓటర్లను ప్రలోభ పెట్టడానికి అధికార పార్టీ టిఆర్ఎస్ నాయకులు చెయ్యని ప్రయత్నాలు లేవని పేర్కొన్న డీకే అరుణ ఓటర్లకు 75 కోట్ల రూపాయల మద్యం తాగించారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏడేళ్ల పాలనలో దళితుల కోసం ఏమీ చేయని టిఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఎన్నికల నేపథ్యంలో దళితుల కోసం దళిత బంధు పథకాన్ని తీసుకు వచ్చారంటూ పేర్కొని మభ్యపెట్టే ప్రయత్నం చేశారన్నారు.
Recommended Video
అధికారులు టీఆర్ఎస్ పార్టీ నేతల చెప్పు చేతల్లోనే ఉన్నారన్న డీకే అరుణ
డబ్బుతో ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్ చూశాడు అని విమర్శించారు. కుక్కను నిలబెట్టిన గెలుస్తారని ముందు చెప్పిన కేసీఆర్ హుజురాబాద్ నియోజకవర్గ ఎన్నికల్లో బయటపడ్డాడని డీకే అరుణ ఆరోపించారు. హుజురాబాద్ పోలింగ్ కు ముందు ఆరువేల రూపాయలు పంచారని, ఇక పోలింగ్ రోజు పది వేల రూపాయల వరకూ పంచారని డీకే అరుణ ఆరోపించారు. అధికారులు టిఆర్ఎస్ పార్టీ నేతల చెప్పుచేతల్లో నడుస్తున్నారని మండిపడ్డారు.