తనను అసెంబ్లీలో చూడొద్దని కేసీఆర్ పంతం; హుజురాబాద్ లో పోలీసుల అండతో అధికార పార్టీ డబ్బుల పంపిణీ: ఈటల రాజేందర్
హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. హుజురాబాద్ ఉపఎన్నిక పోలింగ్ పై రాష్ట్రం మొత్తం దృష్టిసారించింది. ఈ ఎన్నిక అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ కు, టిఆర్ఎస్ పార్టీ నుండి అత్యంత దారుణంగా అవమానించినబడిన నేత ఈటెల రాజేందర్ కు మధ్య ప్రతిష్టాత్మకంగా మారడంతో రాష్ట్రవ్యాప్త ఆసక్తి నెలకొంది. హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన అధికార ప్రతిపక్ష పార్టీలకు ఈరోజు ఎన్నికల పోలింగ్ టెన్షన్ పుట్టిస్తుంది. హుజురాబాద్ నియోజకవర్గ ఓటర్ల తీర్పు ఏవిధంగా ఉంటుందో అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.
హుజురాబాద్ ఉప ఎన్నికలో సైలెంట్ ఓటింగ్; ఎవరి కొంప ముంచుతుందో? నేతల్లో టెన్షన్!!
ఆత్మగౌరవాన్ని గెలిపించుకోవాలన్న ఈటల రాజేందర్
అయితే హుజరాబాద్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ప్రతిపక్ష పార్టీల నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మద్యం ఏరులై పారుతుందని, వందల కోట్ల డబ్బులను హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు పంచుతూ ఎన్నికల ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపణలు వెల్లువగా మారాయి. తాజాగా హుజూరాబాద్ నియోజకవర్గంలో పోలింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో కమలాపూర్ మండలం లో ఓటు హక్కు వినియోగించుకున్న ఈటల రాజేందర్ దంపతులు హుజురాబాద్ నియోజకవర్గ ఓటర్లందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆత్మగౌరవాన్ని గెలిపించుకోవాలని ఆయన కోరారు.
డబ్బుల కోసం ఆందోళనలు.. ఇది ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ
ఇదే సమయంలో ఈటల రాజేందర్ అధికార టీఆర్ఎస్ పార్టీ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజురాబాద్ లో పోలీసులు స్వయంగా రక్షణ కల్పించి అధికార పార్టీ డబ్బులు పంచేలా చేశారని బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ ఆరోపించారు. కమలాపూర్ లో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మాట్లాడిన ఆయన నియోజకవర్గంలో మద్యం ఏరులై పారింది అని వందల కోట్ల రూపాయలను పంపిణీ చేశారని ఆరోపణలు గుప్పించారు. ప్రజలే బహిరంగంగా తమకు డబ్బులు అందలేదని ఆందోళనకు దిగారు అంటే ఇది ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని ఆయన అభివర్ణించారు
అధికార యంత్రాంగం సహాయంతో సర్వశక్తులు ఒడ్డుతున్న కేసీఆర్
సీఎం కేసీఆర్ ఈటల రాజేందర్ ను అసెంబ్లీలో చూడొద్దని పంతం పట్టారని పేర్కొన్న ఈటెల రాజేందర్ అందుకే అధికార యంత్రాంగం సహాయంతో సర్వశక్తులు ఒడ్డుతున్నారు అని ఆరోపణలు గుప్పించారు. ప్రజలంతా ఈ పరిస్థితులను ఎదుర్కోక పోతే సమాజం బానిసత్వంలోకి వెళ్ళిపోతుందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఆత్మగౌరవాన్ని, ధర్మాన్ని గెలిపించుకోవాలని ఈటల రాజేందర్ హుజురాబాద్ నియోజకవర్గ ఓటర్లకు పిలుపునిచ్చారు.ఇదే సమయంలో పిడికెడు నాయకులు ప్రలోభాలకు గురి అవుతారు కానీ ప్రజలు కారని ఈటెల రాజేందర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఎన్నికల కమిషన్ నిశ్చేష్టంగా చూస్తోంది .. ప్రజాస్వామ్యం సిగ్గుపడుతోంది
కెసిఆర్ అందరినీ కొనుగోలు చేసి కోవర్టులుగా మార్చుకున్నారని ఈటల మండిపడ్డారు. ప్రజల ప్రేమ, అభిమానం ముందు డబ్బులు, మద్యం పనిచేయవని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఉత్సాహంగా ఎన్నికల పోలింగ్ లో పాల్గొనడం మంచి సంకేతమని ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల కమిషన్ నిశ్చేష్టంగా చూస్తోందని ప్రజాస్వామ్యం సిగ్గుతో తలదించుకోవాలని ఈటల రాజేందర్ అసహనం వ్యక్తం చేశారు.ఈ రోజు సాయంత్రానికి 90 శాతం పోలింగ్ అవుతుందని అనుకుంటున్నాను అని ఈటల అభిప్రాయపడ్డారు. ఇక ఈ ఎన్నికల్లో ప్రభుత్వం ఒక వైపు ఉంటే ప్రజలంతా మరో వైపు ఉన్నారు అని ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున వ్యాఖ్యానించారు.