హుజూరాబాద్లో రూ. 3.52 కోట్ల విలువైన సొత్తు సీజ్, ఫిర్యాదులపై చర్యలు: సీఈవో
హైదరాబాద్: హుజూరాబాద్ ఉపఎన్నిక సందర్భంగా డబ్బు, మద్యం పంపిణీపై ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు, పరిశీలకులకు ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ ఏర్పాట్లపై ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది.
హుజూరాబాద్లో ఇప్పటి వరకు రూ. 3.52 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నామని సీఈవో వెల్లడించారు. ఎక్కడ ఎలాంటి ఫిర్యాదు వచ్చినా వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారిని ఆదేశించారు. జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు నివేదికలు పంపాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

పోలింగ్ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఈసీ.. స్థానికేతరులు ఇంకా ఎక్కడైనా ఉంటే వెంటనే పంపించివేయాలని ఆదేశించింది. ఎలాంటి శాంతిభద్రతల సమస్యల తలెత్తకుండా చూడాలని, పోలింగ్ సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఈసీ అధికారులు తెలిపారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు డబ్బు, మద్యం, ఇతర వస్తువులను పంపిణీ చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని అధికారులు.. పరిశీలకును ప్రశ్నించారు.
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్, పోలీసుశాఖ నోడల్ అధికారి జితేందర్, కరీంనగర్, హనుమకొండ జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులు, ఎన్నికల పరిశీలకులు సమీక్షకు హాజరయ్యారు. పోలింగ్ ఏర్పాట్లపై సమీక్షించిన ఈసీ అధికారులు.. శాంతిభద్రతలు, కొవిడ్ నిబంధనల అమలుపై ఆరా తీశారు.
డబ్బులివ్వట్లేదని ప్రజల ఆందోళనలు
ఉపఎన్నికల సందర్భంగా పలు పార్టీలు డబ్బులు పంచుతున్నాయని, అయితే, తమకు ఇవ్వలేదంటూ పలు గ్రామాల ప్రజలు ఆందోళనలకు దిగడం చర్చనీయాంశంగా మారింది. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం గంగారంలో డబ్బుల కోసం స్థానికులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. డబ్బుల కోసం గొడవలు చేస్తే కేసులు పెడ్తామని పోలీసులు బెదిరిస్తున్నారని మహిళలు అన్నారు.
Recommended Video
మమ్మల్ని బెదిరించడం కాదు.. డబ్బులు పంపిణీ చేసే వాళ్లను ఎందుకు అడ్డుకోవడం లేదని పోలీసుల్ని ప్రజలు ప్రశ్నించారు. అసలు డబ్బులు ఎవరు పంచమన్నారని మహిళలు నిలదీశారు. దీంతో మహిళలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. డబ్బులు ఇస్తే అందరికీ ఇవ్వాలని, కొందరికి ఇచ్చి మరికొందరికి ఇవ్వకపోతే సర్పంచ్ ఇంటిని ముట్టడిస్తాంటూ ఆందోళన చేపట్టారు. మరోవైపు, డబ్బులు తమకు అందలేదని హుజురాబాద్ మండలం కాట్రపల్లి, రాంపూర్లోని గ్రామ సర్పంచ్ల ఇళ్ల ముందు గ్రామస్ధులు ధర్నా చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పెద్దపాపయ్య పల్లిలో కొంతమందికే డబ్బులు ఇచ్చి.. మిగతా వారికి ఇవ్వడం లేదని స్థానికులు ఆందోళనకు దిగారు. గ్రామంలోని 800 కుటుంబాలకి డబ్బులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. గ్రామ సర్పంచ్ వచ్చి సమాధానం చెప్పేదాక ఆందోళన విరమించేలేదని మహిళలు. హనుమకొండ జిల్లా కమలాపూర్లోనూ స్థానిక మహిళలు ఆందోళనకి దిగారు. కొంతమందికే డబ్బులు ఇచ్చి.. మిగతా వారికి ఇవ్వడం లేదంటూ ఆందోళన చేశారు.












Click it and Unblock the Notifications