సీఎం కేసీఆర్ రోడ్ షో లు -రేవంత్ సభలు : బైపోల్ లో రెండు పార్టీల్లో హై ఓల్టేజ్..!!
హుజూరాబాద్ బై పోల్ పోలింగ్ తేదీ సమీపిస్తోంది. దీంతో..ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. బీజేపీ అగ్ర నాయకులు అంతా హుజూరాబాద్ లోనే మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి మంత్రి హరీష్ తమ పార్టీ అభ్యర్ది గెలుపు బాధ్యతలను తన భుజస్కందాల పైన వేసుకున్నారు. ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. ఇక, ఇదే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో సాధారణంగా భారీ బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. కానీ, ఈ సారి ఆ అవకాశం కనిపించటం లేదు.
కేసీఆర్ రోడ్ షో ల్లో పాల్గొంటారా
దీనికి సంబంధించి ఈ నెల 27న హన్మకొండ జిల్లా పెంచికల్ పేట గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సభ ఏర్పాటు చేయాలని పార్టీ నేతలు నిర్ణయించారు. కానీ, తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ సభ నిర్వహణ సాధ్య పడే పరిస్థితి కనిపించటం లేదు. ఉప ఎన్నికతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న జిల్లాలు, చుట్టు పక్కల నియోజకవర్గాల్లో ఏ రాజకీయ కార్యకలాపాలు చేపట్టకూడదని సీఈసీ ఆదేశించడంతో...సభ రద్దయినట్టు తెలుస్తోంది. ఆదేశించింది.
ప్రచారం ముగిసేలోగా కేసీఆర్ పర్యటన
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు హుజూరాబాద్ ఉప ఎన్నిక కారణంగా కరీంనగర్, హనుమకొండ జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. దీంతో ఈనెల 27న హన్మకొండ జిల్లా పెంచికల్ పేట గ్రామంలో తలపెట్టిన కేసీఆర్ బహిరంగ సభ రద్దయినట్లుగా చెబతున్నారు. దీంతో.. హుజూరాబాద్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ రోడ్ షో ఉండే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం హుజారాబాద్ పర్యటనకు సిద్దమయ్యారు.
రేవంత్ రెండు రోజుల షెడ్యూల్
శనివారం నుంచి రేవంత్ రెండు రోజుల పాటు హుజూరాబాద్ లో ప్రచారంలో పాల్గొంటున్నారు. హుజూరాబాద్ ఎన్నిక రేవంత్ బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలి ఎన్నిక కావటంతో ఆయన సమర్ధతకు పరీక్షగా జరిగిన ప్రచారానికి సమాధానం చెప్పారు. అయితే, ఎన్నికల షెడ్యూల్ కు ముందు నియోజకవర్గంలో ప్రచారం చేసిర రేవంత్ ఇప్పుడు పార్టీ అభ్యర్ది బల్మూరి వెంకట్ కు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. శనివారం కరీంనగర్ నుంచి 3 గంటలకు వీణవంక చేరుకోనున్న రేవంత్ వీణవంక బస్టాండ్ ప్రాంగణంలో సమావేశం నిర్వహించనున్నారు.
ఈటలకు ప్రతిష్ఠాత్మకంగా మారిన ఎన్నిక
అనంతరం వీణవంక నుంచి జమ్మికుంటలో ప్రచారం నిర్వహిస్తారు. ఆదివారం మధ్యాహ్నం 3గంటలకు ఇల్లందకుంటలో శ్రీరాములపల్లి ఎక్స్ రోడ్డు వద్ద ప్రచారం నిర్వహించనున్నారు. అనంతరం అక్కడినుంచి కమలాపూర్ చేరుకొని బస్టాండ్ సమీపంలో ప్రచారం నిర్వహించనున్నారు. ఇక, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్..విజయ శాంతి ఇప్పటికే నియోజకవర్గ పరిధిలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. తాను బీజేపీలో చేరిన సమయం నుంచే ఈటల రాజేందర్ ప్రచారం ప్రారంభించారు. ఈ ఎన్నిక ఈటల వర్సెస్ కేసీఆర్ గా మారిందనే ప్రచారం సాగుతోంది. ఈటల కు ఈ ఉప ఎన్నికలో గెలవటం వ్యక్తంగతంగానూ ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది.