రాజకీయ సన్యాసమే: సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావుకు ఈటల రాజేందర్ సవాల్
కరీంనగర్: హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావును లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు ఈటల. ఇక టీఆర్ఎస్ తరపున బాధ్యతను హరీశ్ రావు తీసుకున్నారు. ఈటలతోపాటు బీజేపీ, కేంద్రంపైనా ఆయన విమర్శల దాడికి దిగుతున్నారు. తాజాగా, ఈటల, హరీశ్ రావు తమ విమర్శలను కొనసాగించారు. పరస్పరం సవాళ్లు విసురుకున్నారు.
తాజాగా, ఈటల రాజేందర్ మరోసారి టీఆర్ఎస్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ఓడిపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని.. ఒకవేళ టీఆర్ఎస్ ఓడిపోతే కేసీఆర్ రాజీనామా చేస్తారా? అంటూ ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. తాను హుజూరాబాద్లో అభివృద్ధి చేయలేదని హరీశ్ రావు అనడం సిగ్గుచేటని అన్నారు. 'మీ పోలీసులని, అధికారులను, మంత్రులను, డబ్బులు ఆపు, కొనుగోళ్లు ఆపి ప్రచారం చెయ్యి నువ్వు గెలిస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటా. నువ్వు తప్పుకుంటావా? ఆ దమ్ముందా?' అంటూ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శక్తి పైసలతో రాదని.. ప్రజా బలంతో వస్తుందన్నారు.

తాను సాయం చేసిన వారు..తనను కాపాడుకుంటారన్నారని తెలిపారు ఈటల. హుజురాబాద్ ఎడ్డిది కాదని... చైతన్యవంతమైన గడ్డ అని స్పష్టం చేశారు. కెసిఆర్.. ఇక నీ మోసం చెల్లదని... ఇండియా టుడే సర్వే కూడా తేల్చిందన్నారు. 84 శాతం ప్రజలు కేసీఆర్ను నమ్మడం లేదన్నారు. తనను గెలిపించి.. కెసిఆర్ అహంకారాన్ని అణచివేయాలని ఈటల ప్రజలను కోరారు. 'మీ మామ ఆదేశాలతో నా గొంతు. పిసకాలని నా దగ్గరికి వచ్చావు..' ఏదో ఒక రోజు హరీశ్ గొంతు కూడా పిసకడం ఖాయమని ఈటల వ్యాఖ్యానించారు. బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కూడా సీఎం కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు. ఓ సర్వేలో దేశంలోనే అతిపెద్ద అవినీతి ముఖ్యమంత్రి కేసీఆర్ అని తేలిందన్నారు. ఏడేళ్లలో కేసీఆర్ ఆయన కుటుంబం రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకుందని ఆరోపించారు. కమలాపూర్ ఉమామహేశ్వరి గార్డెన్స్ లో ఈటెల అధ్వర్యంలో... ఉప్పల్, దేశరాజపల్లికి చెందిన పలువురు కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు, కాకతీయ యూనివర్సిటీ కి చెందిన పీహెచ్డీ విద్యార్థులు బీజేపీలో చేరారు.
మరోవైపు, మంత్రి హరీశ్ రావు కూడా హుజరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు కోసం శ్రమిస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ విజయం కోసం ఆయన ప్రచారం చేస్తున్నారు. హుజూరాబాద్ గడ్డ... టీఆర్ఎస్ అడ్డా అని వ్యాఖ్యానించారు. ఈటల రాజేందర్ చేరక ముందు నుంచి టీఆర్ఎస్ అక్కడ ఉందన్నారు. అసలు నియోజకవర్గంలో బీజేపీకి ఓటేసే వాళ్లు ఉన్నారా? అని ప్రశ్నించారు. ఆత్మగౌరవం అంటే గోడ గడియారాలు పంచడమేనా? అని ఈటలను నిలదీశారు. ఈటల గెలిస్తే వ్యక్తిగా ఆయనకు.. బీజేపీ పార్టీకి లాభం. అదే.. గెల్లు శ్రీను గెలిస్తే హుజూరాబాద్ ప్రజలకు లాభం అని హరీశ్ వ్యాఖ్యానించారు. విదేశాల నుంచి నల్లధనం తెప్పించి.. ఒక్కొకరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వెస్తామన్నారు. ఒక్క రూపాయి అయినా వేశారా..? అని ప్రశ్నించారు.
Recommended Video
హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ విజయం సాధిస్తే హుజూరాబాద్ అభివృద్దికి మలుపు అని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ లో బీజేపీ గెలిస్తే ఏం లాభమని ఆయన ప్రశ్నించారు. వీణవంకలో కనీసం రూ. 10 లక్షల పనిచేశారా? అని ఆయన ప్రశ్నించారు. హుజూరాబాద్ అభివృద్ది కోసం తెలంగాణ బీజేపీ నేతలు ఢిల్లీ వెళ్లి రావాలని ఆయన సూచించారు. రూ. 5 వేల కోట్ల ప్యాకేజీని తీసుకొచ్చి తెలంగాణ బీజేపీ నేతలు హుజూరాబాద్లో ఓట్లు అడగాలని ఆయన కోరారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరల పెంపు తప్పఆ పార్టీ చేసిందేమి లేదన్నారు. ఏడేళ్లలో టీఆర్ఎస్ చేసిందేమిటో లెక్కలు మొత్తం మొన్ననే చెప్పామన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications