టీఆర్ఎస్ కు "ఈట"ల దిగింది - పని చేయని పధకాలు..చేరికలు : 23,865 ఓట్లతో రాజేందర్ గెలుపు..!!
అనూహ్యం. అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి మారి..ఎన్నికల్లో హోరా హోరీగా పోరాడిన ఈటల రాజేందర్ కు హుజూరాబాద్ ప్రజలు పట్టం కట్టారు. వేల ఓట్ల తేడాతో టీఆర్ఎస్ పైన విజయం సాధించారు. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ గా జరిగిన ఎన్నిక అంటే అంగీకరించలేని పరిస్థితి. కేసీఆర్ వర్సస్ ఈటల అన్నట్లుగా ఈ ఎన్నిక సాగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈటల గెలవటానికి వీళ్లేదనే విధంగా అనేక ప్రయత్నాలు అధికార పార్టీ నుంచి చేసారు. హుజూరాబాద్ లో అఖిలపక్ష నేతలను టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ అభ్యర్ది కౌశిక్ రెడ్డి...టీడీపీ నుంచి ఎల్ రమణ తో సహా స్థానికంగా ఉన్న పలువురు నేతలకు గులాబీ కండువా కప్పారు. పదవులు ప్రకటించారు.

హరీష్ గెలుపు బాధ్యతలు
పార్టీ అభ్యర్దిగా గెల్లు శ్రీనివాస్ ను ప్రకటించినా..పూర్తి బాధ్యతలు మంత్రి హరీష్ రావు తీసుకున్నారు. తానే అభ్యర్ధి అన్నట్లుగా ప్రచారం చేసారు. నాగార్జున సాగర్ లో జానారెడ్డి ఓడిపోయారు..ఆయన కంటే ఈటల పెద్ద నేతా అని ప్రశ్నించారు. దళితబంధు పధకం తీసుకొచ్చారు. అది హుజూరాబాద్ కోసం కాదని పదే పదే చెప్పుకొచ్చారు. కానీ, ఆ పధకం అమలు చేసిన గ్రామంలోనూ బీజేపీ ఆధిక్యత సాధించింది. హుజూరాబాద్ లో 2001 నుంచి ఆరు సార్లు గెలిచిన ఈటల..కేసీఆర్ అవకాశం ఇస్తే గెలిచారు. కానీ, ఈ సారి తానే పోటీ చేసి గెలుపొందారు. టీఆర్ఎస్ వీడి బీజేపీలో చేరిన నాటి నుంచే ప్రచారం ప్రారంభించారు. ఆరు సార్లు తనను ఎమ్మెల్యేగా గెలిపించిన తన నియోజకవర్గ ప్రజలతో రాజేందర్ మమేకం అయ్యారు.

రాజేందకే నియోజకవర్గ ప్రజల మద్దతు
తన పరిస్థితిని వివరించారు. మరో సారి గెలిపించమని కోరారు. అధికార పార్టీ శక్తి యుక్తుల గురించి వివరిస్తూ..పార్టీ మారినా..ప్రజల్లో తన వ్యక్తిగతంగా ఉన్న పరిచయాలు...వారి కోసం చేసిన పనులు..వారికి అవసరమైతే అండగా నిలుస్తారనే నమ్మకం నిలబెట్టుకున్న ఈటలకు ఆ నియోజకవర్గ ప్రజలు సైతం అండగా నిలిచారు. హుజూరాబాద్ లో గెలుపు ఖాయమైందని..అన్ని సర్వేలు అదే చెబుతున్నాయంటూ టీఆర్ఎస్ నేతలు చెబుతూ వచ్చారు. అయినా..రాజేందర్ తన పోరాటం వదల్లేదు. ఆస్తులు మొత్తం పోయినా లొంగేది మాత్రం లేదని తేల్చి చెప్పారు. రాజేందర్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకొని ఆరోపణలు చేసారు. పార్టీ పరంగా బీజేపీ పైనా విమర్శలు గుప్పించారు.

మంత్రులు వర్సెస్ ఈటల
మంత్రులు..ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. ఇక, బీజేపీ నుంచి సైతం నేతలు ప్రచారం చేసారు. కానీ, అక్కడ బీజేపీ కంటే ఈటల రాజేందర్ గెలిచారనేదే సరైనదిగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అహంకారినికి - ఆత్మగౌరవానికి మధ్య పోరాటంగా ప్రచారం చేయటంలో బీజేపీ నేతలు ముందు నిలిచారు. అయితే, ఇక్కడ కాంగ్రెస్ అసలు పోటీలో ఉందా అనే విధంగా అనుమానం కలిగేలా ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ ఓట్లు సైతం రాజేందర్ కే పడ్డాయనేది కౌంటింగ్ ట్రెండ్స్ స్పష్టం చేస్తున్నాయి. ఇక, పోస్టల్ బ్యాలెట్ లో టీఆర్ఎస్ ముందుంది. ఆ తరువాత ఒకటో రౌండ్ మొదలు 22వ రౌండ్ వరకు రాజేందర్ ఆధిక్యత కొనసాగింది. ఎనిమిదో రౌండ్ లో వీణవంక మండలంలో ఈటల ఒక్కసారి వెనుకంజలో నిలిచారు. అయినా..ఆ మండలంలోని టీఆర్ఎస్ అభ్యర్ది గెల్లు శ్రీను స్వగ్రామంలో సైతం ఈటల ఆధిక్యత పొందారు.

ఏడోసారి శాసనసభలోకి ఎంట్రీ..
ఈటల రాజేందర్ ఇప్పుడు గెలుపు ద్వారా ఏడోసారి శాసనసభలో కాలు పెడుతున్నారు. దుబ్బాక ఎన్నికల్లో రఘునందన్ రావు గెలుపు తరువాత ఈ విజయం బీజేపీకి కొత్త ఊపును ఇస్తోంది. వ్యక్తిగతంగా ఇది ఈటల విజయం. కేసీఆర్ పైన ఈటల సాధించిన విజయం గా విశ్లేషకులు చెబుతున్నారు. ఇక, అసెంబ్లీ వేదికగానూ కేసీఆర్ ప్రభుత్వం పైన రాజేందర్ పోరాటం చేయాల్సి ఉంది. దీంతో..ఇప్పుడు బీజేపీలోనూ ఈటల పరపత్తి పెరగనుంది. జాతీయ నాయకత్వం సైతం ఈటలను గుర్తించేలా గెలుపొందారు. దీంతో, ఈ ఫలితం ద్వారా తెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణాలు తెర పైకి రావటం ఖాయంగా కనిపిస్తోంది.
-
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!!












Click it and Unblock the Notifications