హుజురాబాద్ లో యుద్ధం మొదలైంది.. కేసీఆర్, హరీష్ లకు దమ్ముంటే ఆ పని చెయ్యాలన్న ఈటల రాజేందర్
తెలంగాణ రాష్ట్రంలో హుజురాబాద్ ఉప ఎన్నిక ఇప్పట్లో లేదని తెలిసినా దసరా, దీపావళి పండుగ తర్వాతనే ఉంటాయని తెలిసినా హుజూరాబాద్ నియోజకవర్గంలో మాత్రం ఎన్నికల వేడి కొనసాగుతూనే ఉంది. హుజరాబాద్ లో నువ్వా నేనా అన్నట్టు ఎత్తులు పైఎత్తులతో ఉప ఎన్నికల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య హుజురాబాద్ కేంద్రంగా మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలతో హుజురాబాద్ రాజకీయం రసకందాయంలో పడింది.

ఈటల వర్సెస్ కేసీఆర్ .. ఎత్తులు పైఎత్తులతో రసవత్తర రాజకీయం
ఈటల రాజేందర్ ను ఓడించడమే లక్ష్యంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ ట్రబుల్ షూటర్ మంత్రి హరీష్ రావు వ్యూహాలు రచిస్తున్నారు. హుజరాబాద్ లో మకాం వేసి మరీ ఈటలకు చెక్ పెట్టడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. బిజెపిని టార్గెట్ చేస్తూ రాష్ట్రంలో ధరల పెరుగుదలకు బిజెపి ప్రభుత్వం కారణమని నిప్పులు చెరుగుతున్నారు. ఇక ఈటల రాజేందర్ కు సహకరించే వారిని ఆపరేషన్ ఆకర్ష్ అంటూ తమ వైపుకు మరల్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈటల రాజేందర్ సైతం హరీష్ రావు ఎత్తుగడలకు చెక్ పెడుతూ ప్రజా క్షేత్రంలో దూసుకుపోతున్నారు. తమ వారిని కాపాడుకుంటూనే, అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రజలను ఏకతాటి పైకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

సీఎం కేసీఆర్ పతనానికి హుజురాబాద్ ఉప ఎన్నిక నాంది: ఈటల
హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి టిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం అవుతుందని టిఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ, జరుగుతున్న అభివృద్ధిని చూపిస్తుంటే, హుజూరాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి తానే కారణమని ఈటల రాజేందర్ ప్రచారం నిర్వహిస్తున్నారు. తాను రాజీనామా చేయడం వల్ల సీఎం కేసీఆర్ హుజూరాబాద్ నియోజకవర్గంపై దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తున్నారని, ఈ అభివృద్ధికి కారణమైన తననే గెలిపించాలని ఈటల రాజేందర్ ప్రచారం చేస్తున్నారు. ఇక తాజాగా మరోమారు కెసిఆర్ పై ధ్వజమెత్తిన ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ పతనానికి హుజురాబాద్ ఉప ఎన్నిక నాంది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

నోట్ల కట్టలు, మందు సీసాలు తన గెలుపును ఆపలేవు
కరీంనగర్ జిల్లాలోని జోగిపేటలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో శనివారం ప్రజాసంకల్పయాత్ర బహిరంగ సభ నిర్వహించిన క్రమంలో ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నోట్లకట్టలు, మందు సీసాలు తన గెలుపును ఆపలేవని ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు. ప్రగతి భవన్ లో కూర్చొని తన గొంతు పిసికే కుట్రలు చేస్తున్నారని సీఎం కేసీఆర్ పై ఆరోపణలు గుప్పించిన ఈటల రాజేందర్ తన సహచరుడు హరీష్ రావు ఆ కుట్రలను అమలు చేస్తున్నాడని షాకింగ్ కామెంట్స్ చేశారు.

వారిపై తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్న ఈటల
తెలంగాణ రాష్ట్రంలో యుద్ధం మొదలైందని పేర్కొన్న ఈటల దమ్ముంటే కెసిఆర్, హరీష్ రావులు తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. తనపై వారు పోటీ చేసి గెలిస్తే, తాను ఓటమి పాలైతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేంద్రంపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ విమర్శిస్తున్న కెసిఆర్, ఢిల్లీకి వెళితే వంగి వంగి దండాలు పెడతారని ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. హుజురాబాద్ నియోజకవర్గంలో గెలుస్తానని ధీమాతో ఈటల రాజేందర్ ముందుకు దూసుకుపోతున్నారు. తనదైన శైలిలో ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications