హుజుర్ నగర్ ఉప ఎన్నికపై గురి.. టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలో బీజేపీ
నల్గొండ : టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలో బీజేపీ అన్న చందంగా తయారైంది హుజుర్ నగర్ ఉప ఎన్నిక పరిస్థితి. బై ఎలక్షన్స్లో సత్తా చాటి గులాబీ జెండా రెపరెపలాడించేందుకు టీఆర్ఎస్ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ కంచుకోటగా ఉండటంతో హస్తం గుర్తు నేతలు కూడా అదే స్థాయిలో ఫైట్ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. అంతో ఇంతో క్యాడర్, లీడర్ల బలమున్న ఈ రెండు పార్టీల మధ్యే ప్రధాన పోటీ కనిపిస్తున్నా.. బీజేపీ నేతలు సైతం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం చర్చానీయాంశమైంది.

హుజుర్నగర్ పై కన్ను.. త్రిముఖ పోటీయా? లేదంటే..!
నల్గొండ పార్లమెంటరీ స్థానం నుంచి ఎంపీగా, హుజుర్నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపొందారు. ఆ క్రమంలో ఆయన నల్గొండ ఎంపీగా కంటిన్యూ అవుతున్నారు. హుజుర్నగర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేయడంతో అక్కడ బై పోల్స్ అనివార్యమయ్యాయి. ఈ నేపథ్యంలో జనరల్ అసెంబ్లీ ఎన్నికలను మించి హుజుర్నగర్ ఉప ఎన్నిక పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపికైంది. ఇటు టీఆర్ఎస్, అటు కాంగ్రెస్ పార్టీ నేతలు హుజుర్నగర్ బై పోల్స్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలకు గాను 88 స్థానాల్లో విజయఢంకా మోగించిన గులాబీ దండు.. ఈసారి సింగిల్ డిజిట్ను కూడా కారు ఖాతాలో వేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
అదలావుంటే కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలా మారిన హుజుర్నగర్లో మరోసారి సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు ఆ పార్టీ నేతలు. ఇప్పటిదాకా ఆ సెగ్మెంట్లో హస్తం జోరు సాగుతుండటంతో ఈసారి కూడా మరోసారి జెండా ఎగిరేసేందుకు సై అంటున్నారు. ఆ రెండు పార్టీల నేతలు నువ్వా నేనా అనే రీతిలో ఫైట్ చేసే అవకాశాలు కనిపిస్తున్న వేళ బీజేపీ నేతలు కూడా ఈ స్థానంపై కన్నేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

నువ్వా నేనా.. టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. మధ్యలో బీజేపీ
కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతికి టికెట్ కన్ఫామ్ అయింది. టీఆర్ఎస్ నుంచి ఎన్ఆర్ఐ సైదిరెడ్డి రంగంలోకి దిగుతున్నారు. అటు బీజేపీ నుంచి ప్రధానంగా శ్రీకళారెడ్డి పేరు వినిపిస్తోంది. అయితే ఇక్కడ టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మాదిరిగా పోటీ కనిపిస్తోంది. అదలావుంటే అధికార పక్షమైన టీఆర్ఎస్ హుజుర్నగర్ స్థానం కైవసం చేసుకోవడానికి కసరత్తు చేస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా సీరియస్గా దృష్టి సారించారు.
బై పోల్స్ టీఆర్ఎస్కు కలిసొచ్చే అంశంగా రాజకీయ శ్రేణులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సీఎం కేసీఆర్ ఛరిష్మా, ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో సైదిరెడ్డి ఓడిపోవడంతో సానుభూతి.. ఇవన్నీ కూడా గులాబీ దండుకు కలిసొచ్చే అంశాలుగా చెబుతున్నారు.

ఇంతకు గెలుపు ఎవరిదో?
ఇక కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా హుజుర్నగర్ అసెంబ్లీ సెగ్మెంట్పై కన్నేశారు. ఇప్పటికే అది కాంగ్రెస్ పార్టీ కంచుకోట. అదే క్రమంలో ఇదివరకు ఎమ్మెల్యేగా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులు ఆ పార్టీకి కలిసిరావడం.. సంప్రదాయ ఓటు బ్యాంకు ఉండటం.. ఇవన్నీ కూడా కాంగ్రెస్ అభ్యర్థి విజయావకాశాలకు మెట్టుగా మారనున్నాయనే టాక్ నడుస్తోంది.
మొత్తానికి హుజుర్నగర్ ఉప ఎన్నిక తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపికైంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు ఎవరికివారుగా గెలుపు అవకాశాలపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటు బీజేపీ కూడా తాము సైతం అంటూ రంగంలోకి దిగడం చర్చానీయాంశమైంది.












Click it and Unblock the Notifications