హుజూర్నగర్లో ఉత్తమ్ ఇంటికే, ఉట్టి మాటలు ప్రజలు నమ్మరన్న మంత్రి సత్యవతి, ఎంపీ కవిత
హుజూర్నగర్లో గులాబీ గుబాళించడం ఖాయమని టీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గానికి ఉత్తమ్కుమార్ రెడ్డి చేసిందేమీ లేదని విమర్శించారు. ఉత్తమ్ ఉట్టి మాటలు ఇక ప్రజలు నమ్మబోరని విశ్వాసం వ్యక్తం చేశారు. హుజూర్నగర్లో టీఆర్ఎస్ జెండా ఎగిరితే అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ నేతలు అన్నారు. ఆదివారం మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, అభ్యర్థి సైదిరెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు.
ఉత్తమ్ ఇంటికే
హుజూర్నగర్లో ఉత్తమ్కుమార్ను ఇంటికి పంపించాల్సిన సమయం ఆసన్నమైందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గతంలో తాను సీఎం అవుతానని, కేంద్రమంత్రిని అవుతానని కళ్లబొల్లి కబుర్లు చెప్పారని విమర్శించారు. ఈసారి కూడా అలా వంచించేందుకు ముందుకొస్తారని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణలక్ష్మీ పథకం అమలుచేస్తే సంతకాలు పెట్టకుండా జాప్యం చేసిన ఘనుడు ఉత్తమ్ అని విమర్శించారు. తండాల అభివృద్దిని కూడా ఉత్తమ్ అడ్డుకున్నారని మండిపడ్డారు. తండాలను గ్రామ పంచాయతీలు చేసిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని తెలిపారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ పరామావధి అని ఆమె స్పష్టంచేశారు.
తండాలకు సౌలతులు
తండాలకు అన్నీ వసతులు కల్పిస్తున్నామని మంత్రి సత్యవతి రాథోడ్ వివరించారు. గిరిజన రైతులకు 24 గంటల కరెంట్ అందిస్తున్నామని తెలిపారు. ఆడపిల్లల పెళ్లికి, మహిళల ప్రసవానికి కూడా నగదు ఇస్తున్నారని తెలిపారు. 40 ఏళ్లలో చేయనిది నాలుగేళ్లలో చేసి చూపించామని, హుజూర్నగర్లో టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు. హుజూర్నగర్లో రూ.కోటి వ్యయంతో సేవాలాల్ భవన్ కట్టిస్తానని తెలిపారు. తండాలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తీసుకొస్తానని ప్రకటించారు. ఇచ్చిన హామీలన్నీ తీర్చి.. మళ్లీ మీ ముందుకొస్తానని సత్యవతి రాథోడ్ ఆశేష జనవాహినిలో హామీనిచ్చారు.
సైదిరెడ్డి లోకల్
సైదిరెడ్డి పక్కా లోకల్ అని ఎంపీ మాలోతు కవిత అన్నారు. జాన్ పహాడ్ సైదులు పేరు పెట్టుకుని తన స్థానికుడినని నిరూపించుకున్నారని పేర్కొన్నారు. సైదిరెడ్డిని గెలిపిస్తే పిలిపించి తండాలు అభివృద్ధి చేయిస్తామని తెలిపారు. ఉప ఎన్నికతో తమకు అద్భుతమైన అవకాశం వచ్చిందని తెలిపారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు.
అభివృద్ధి పథం
తండాలను అభివృద్ధి చేస్తానని అభ్యర్థి సైదిరెడ్డి పేర్కొన్నారు. ఎంపీ కవిత, మంత్రి సత్యవతి రాథోడ్తో కలిసి అభివృద్ధికి పాటుపడతానని అభ్యర్థి సైదిరెడ్డి హామీనిచ్చారు. ఈసారి తమకు అవకాశం ఇస్తే ఇన్నాళ్లు చేయని అభివృద్ధి చేసి చూపిస్తామని తెలిపారు. దశాబ్ధాలుగా హుజూర్నగర్కు ఉత్తమ్కుమార్ రెడ్డి చేసిందేమీ లేదని గుర్తుచేశారు. మాటలు కోటలు దాటుతాయి తప్ప.. పనులు చేయరని గుర్తుచేశారు.