కన్నేస్తే.. కెమెరా మాయమవ్వాల్సిందే : కానీ క్లైమాక్స్ లో..
హైదరాబాద్ : చోర కళలో ఆరి తేరాడు. కెమెరాలను దొంగలించడంలో ఎవరికీ అనుమానం రాకుండా పని కానిచ్చేయడం వెన్నతో పెట్టిన విద్యగా మార్చకున్నాడు. ఇంకేముంది స్కెచ్ వేశాడంటే కెమెరా లూటీ అయిపోవాల్సిందే.. కానీ క్లైమాక్స్ లో కథ అడ్డం తిరగడం కామనే కాబట్టి, వ్యవహారం బెడిసి కొట్టి.. చివరాఖరికి పోలీసుల చేతికి చిక్కాడు
వివరాల్లోకి వెళ్తే.. పెద్ద మొత్తంలో విలువ చేసే కెమెరాలను తస్కరిస్తున్న ఓ కెమెరా దొంగను అరెస్టు చేశారు హైదరాబాద్ వెస్ట్ జోన్ పోలీసులు. నగరంలోని ఫోటో స్టూడియోలను, వీడియోగ్రాఫర్లను టార్గెట్ చేసుకుని కెమెరా దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని మంగళవారం నాడు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
నిందితుడి నుంచి 50వేలు-5లక్షల వరకు విలువ చేసే ఐదు నికాన్, పానాసోనిక్ కెమెరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొత్తం కెమెరాల విలువ దాదాపుగా 20 లక్షల పైనే ఉండొచ్చని తెలిపారు పోలీసులు.
కాగా, తరుచుగా నగరానికి వచ్చే ఈ నిందితుడు నాంపల్లి ప్యాలెస్ హోటల్ లో బస చేస్తాడు. ఇక మరుసటి రోజు నుంచి కెమెరా దొంగతనాల వేటలో పడుతాడు. ఏదో ఒక ఫోటో స్టూడియోకి వెళ్లి, అక్కడి వాళ్లను బతిమాలి హెల్పర్ గా పనిలో కుదరడం, అలా రెండు మూడు రోజులు స్టూడియోలో ఓనర్లు, మిగతావాళ్ల కదలికలను గమనించి.. ఎవరూ లేని సమయంలో కెమెరాలతో ఉడాయించడం ఇతగాడి నేర చరిత్ర.
ఇదే తరహాలో జస్ట్ డయల్ కి ఫోన్ చేసి నగరంలోని వీడియోగ్రాఫర్లను ఫోటో షూట్ కి రావాల్సిందిగా కోరడం, ఓఎల్ఎక్స్ వంటి వెబ్ సైట్స్ నుంచి వీడియోగ్రాఫర్ల నంబర్లు సేకరించి అవుట్ డోర్ షూట్ ఉందని వాళ్లను పిలవడం.. ఆ తర్వాత రవీంద్రభారతి, గోల్కొండ, ఛార్మినార్ వంటి వాటి వద్దకు తీసుకెళ్లి ఫోటోగ్రాఫ్స్, వీడియోగ్రఫీ తీయించుకోవడం చేస్తుంటాడు. పనంతా పూర్తయ్యాక ఏదైనా ఓ పెద్ద హోటల్ కి తీసుకెళ్లి లంచ్ ఆర్డర్ చేసి.. వాళ్లంతా తింటూ ఉండకుండా ఎవరికీ అనుమానం రాకుండా కెమెరాలతో అక్కడినుంచి ఎస్కేప్ అవుతుండడం చేస్తుంటాడు.
పలు ఫిర్యాదులతో సదరు కెమెరా దొంగపై నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు అతన్ని పట్టుకోగలిగారు.