హైదరాబాద్: నడిరోడ్డుపై యువతిని వివస్త్రను చేసిన ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్
హైదరాబాద్: నగరంలోని జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీనగర్ ప్రాంతంలో గత ఆదివారం రాత్రి ఓ యువతిని వివస్త్రను చేసిన ఘటనపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలపై ఆందోళన కలిగిస్తుందని పేర్కొంది. ఘటనపై వెంటనే దర్యాప్తు చేసి బాధితురాలికి వైద్య సహాయం అందించాలని సూచించింది. ఈ దారుణ ఘటనపై వారం రోజుల్లో డీజీపీ అంజనీకుమార్ నుంచి నివేదిక వస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. జవహర్నగర్కు చెందిన పెద్దమారయ్య(30) కూలీగా పనిచేస్తున్నాడు. అతడు మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం రాత్రి 8.30 గంటలకు తల్లితో కలిసి బాలాజీనగర్ బస్టాండ్ నుంచి ఇంటికి వెళ్తున్నాడు. ఆ సమయంలో స్థానిక యువతి(28) షాప్ నుంచి నడుచుకుంటూ వెళుతోంది. ఆమెను చూసిన మారయ్య ఆమెపై చెయ్యివేసి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో కోప్పడిన యువతి అతడ్ని దూరంగా నెట్టేసింది.

ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన మారయ్య.. ఆమెపై దాడి చేశాడు. అంతటితో ఆగకుండా బలవంతంగా ఆమె దుస్తులను చించి లాగేశాడు. పక్కన ఉన్న మారయ్య తల్లి కనీసం అతడ్ని అడ్డుకోలేదు. అటు నుంచి బైక్పై వెళ్తున్న ఓ మహిళ ఎందుకిలా చేస్తున్నావంటూ ప్రశ్నించడంతో ఆమెపైనా దాడికి ప్రయత్నించాడు.
కాగా, దాదాపు 15 నిమిషాలపాటు ఆ యువతి నగ్నంగా రోడ్డుపైనే రోదిస్తూ కూర్చున్నా.. చుట్టుపక్కలవారు స్పందించకపోవడం శోచనీయం. కొందరైతే ఫొటోలు, వీడియోలు తీస్తూ తమ పైశాచికాన్ని చాటుకున్నారు. ఆ యువకుడు వెళ్లిపోయిన తర్వాత కొందరు వచ్చి ఆమెను కవర్లతో కప్పేసి జవహర్నగర్ పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు, అతడి తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
మంగళవారం బాధితురాలిని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క పరామర్శించారు. నడిరోడ్డుపై ఓ యువతిని వివస్త్రను చేయడం దారుణమన్నారు. నిందితుడితోపాటు అతడ్ని వారించని తల్లిని కూడా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళలకు భద్రత కల్పించడంలో సర్కారు విఫలమైందని మండిపడ్డారు. వెంటనే నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications