నిండిన హుస్సేన్ సాగర్: సెలవు కావడంతో.., భారీ వర్షం ఎందుకిలా?
భారీగా కురిసిన వర్షానికి హుస్సేన్ సాగర్ నిండు కుండలా కనిపిస్తోంది. హైదరాబాదులో ఐదు గంటల పాటు భారీగా వర్షం కురిసింది. దీంతో సాగర్కు వరద నీరు వచ్చి చేరింది.
హైదరాబాద్: భారీగా కురిసిన వర్షానికి హుస్సేన్ సాగర్ నిండు కుండలా కనిపిస్తోంది. హైదరాబాదులో ఐదు గంటల పాటు భారీగా వర్షం కురిసింది. దీంతో సాగర్కు వరద నీరు వచ్చి చేరింది.
హుస్సేన్ సాగర్ నీటి నిల్వ సామర్థ్యం 513.41 మీటర్లు కాగా సోమవారం సాయంత్రం నాటికి 513.50 మీటర్లకు చేరింది. గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 514.75 మీటర్లు. ఈ సామర్త్యం దాటితే దిగువ ప్రాంతాలకు ముప్పు వాటిల్లుతుంది. సాగర్లోకి ఇన్ ఫ్రో మూడు వేల క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 1200 క్యూసెక్కులుగా ఉంది.
గత పదేళ్లలో అక్టోబర్లో కురిసిన అత్యధిక వర్షపాతం
హైదరాబాద్లో కురిసిన భారీ వర్షంతో జనజీవనం స్తంభించింది. సోమవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఆకాశం చిల్లుపడిందా అన్నట్లుగా 13 సెం.మీ. పైగా వర్షం కురిసింది. గత పదేళ్లలో అక్టోబరు నెలలో కురిసిన అత్యధిక వర్షపాతం ఇదే.
మీరాలంలో అత్యధికం
మీరాలంలో 13.2 సెం.మీ.,రాజేంద్రనగర్లో 12.6, అంబర్పేట 12.03, గోల్కొండ 10.4, మోండా మార్కెట్లో 10.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అంతకు ముందు 2013 అక్టోబరు 10న 9.8 సెం.మీ.ల వర్షం కురిసింది. విద్యుత్ తీగ పడి ఒకరు మృతి చెందగా మట్టి గోడ కూలి తండ్రీ కుమారుడు చనిపోయారు. సంగారెడ్డి జిల్లాలో పిడుగుపాటుకు వేర్వేరు ఘటనల్లో తల్లీకొడుకులు నలుగురు చనిపోయారు.
జలమయమైన రోడ్లు
హైదరాబాదులో వందలాది కాలనీలు, కూడళ్లు వరద మునిగిపోయాయి. రోడ్లు మొత్తం జలమయమయ్యాయి. వేలాది ఇళ్లలోకి వాననీరు చేరింది. వర్షతీవ్రతపై సీఎం కేసీఆర్ సోమవారం రాత్రి సమీక్షించారు. జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో సహా సిబ్బంది సహాయక చర్యల్లో ఉన్నారని మంత్రి కేటీఆర్ చెప్పారు.
పొంగిపొర్లిన నాలాలు, రహదారులు
వర్షం నగరాన్ని అతలాకుతలం చేసింది. ఒక్కసారిగా వచ్చిన వరదతో రహదారులు, నాలాలు పొంగిపొర్లాయి. చెరువులు నిండి కాలనీలు, రహదారుల్లోని వాహనాలు కొట్టుకుపోయాయి. లోతట్టు కాలనీల్లోని ఇళ్లలోకి నీరు చేరింది.సెల్లార్లు సెప్టిక్ ట్యాంకులుగా మారాయి. వాహనాలు ఎక్కడికక్కడ వరద నీట మునిగిపోయాయి.
సెలవు దినం కావడంతో..
దసరా పండుగకు అందరూ ఇంటికి వెళ్లడం, సోమవారం గాంధీ జయంతి కావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు కావడంతో సమస్య తగ్గింది. కార్యాలయాల నుంచి ఉద్యోగులు ఇంటికి వెళ్లే సమయంలోనే వర్షం పడింది. కార్యాలయాలు పనిచేసి ఉంటే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. అంతకుముందు ఇంతకంటే తక్కువ వర్షం కురిసినప్పుడు కూడా కార్యాలయాలు ఉన్నప్పుడు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
ఇబ్బందిపడ్డ ఐటీ ఉద్యోగులు
కానీ సోమవారం 13 సెం.మీ. వర్షం కురిసినా అంతలా ట్రాఫిక్ జామ్ కాలేదు. అందుకు సెలవు దినం కావడమే కారణం. ఇదిలా ఉండగా విదేశాల కంపెనీలు యథావిథిగా పనిచేయడంతో ఐటీ ఉద్యోగులు కొంత ఇబ్బంది పడ్డారు. రెప్పపాటులో చాలా రోజులుగా చూడని వర్షం కురిసింది.
ఊళ్లకు వెళ్లిన వారు ఇబ్బంది పడ్డారు
దసరా సెలవుల సందర్భంగా సొంత గ్రామాలకు వెళ్లిన వారు సోమవారం తిరుగు ప్రయాణమయ్యారు. అయితే వర్షం కారణంగా నగరానికి వస్తున్న వాహనాలన్నీ శివారు ప్రాంతాల్లోనే ఆగిపోయాయి. ఎడతెరిపి లేని కుండపోత, ట్రాఫిక్ జాం కారణంగా వందలాది వాహనాలు, ఉప్పల్, శామీర్పేట, ఎల్బీ నగర్ రాజేంద్రనగర్, పటాన్చెరువుల్లో ఆగిపోయాయి.
భారీ వర్షం ఎందుకిలా..
గత జూన్ నుంచి సెప్టెంబరు వరకూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కన్నా హైదరాబాద్లోనే అత్యధికంగా సాధారణం కన్నా 36 శాతం అదనపు వర్షం కురిసింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఒడిశాకు సమీపంలో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఆకాశంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీనిపై నుంచి ఛత్తీస్గఢ్, తెలంగాణ, రాయలసీమ, దక్షిణ కర్ణాటక మీదుగా కేరళ వరకూ మరో ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది భూమికి కి.మీ. ఎత్తులో వెళుతోంది. ఇక బంగాళాఖాతంలో కోస్తాంధ్రకు ఆనుకుని రాయలసీమ వరకూ మరో ఉపరితల ఆవర్తనం ఆకాశంలో 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. వీటన్నింటి ప్రభావం వల్ల ఆకాశం ఒక్కసారిగా చల్లబడి అప్పటికప్పుడు క్యుములోనింబస్ మేఘాలేర్పడి కుంభవృష్టి పడింది. రాష్ట్రంలో ఈ వర్షాలు ఇలాగే కొనసాగి మంగళవారం అక్కడక్కడ భారీగా కురిసే అవకాశాలున్నాయి.