హైదరాబాద్లో బయోలాజికల్ ఇ భారీ పెట్టుబడి: 2500 మందికి ఉపాధి, ‘కూ’తోనే ఒప్పందం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి మరోసారి భారీ పెట్టుడి వచ్చింది. ప్రముఖ ఫార్మా దిగ్గజం బయోలాజికల్ ఇ హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలో రూ. 1800 కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టనున్నట్లు బయోలాజికల్ ఇ సంస్థ తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. భారీ పెట్టుబడితో బయోలాజికల్ ఇ ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు. దీంతో 14 బిలియన్ డోస్ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసేలా ప్రపంచంలోని ఏకైక ప్రాంతంగా హైదరాబాద్ నిలవనుందని తెలిపారు.
బయోలాజికల్ ఇ విస్తరణతో 2500 మందికి ఉపాధి
హైదరాబాద్ ఇప్పటికే వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ గా పేరు పొందిందని చెప్పారు. తాజా విస్తరణ వల్ల 2500 మందికి ఉపాధి లభించనుందని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. బయోలాజికల్ ఇ ప్రతినిధిలు మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు. టీకాలు, ఏపీఐలు, ఫార్ములేషన్ల తయారీ కోసం పెట్టుబడులు పెట్టనున్నట్లు బయోలాజికల్ ఇ సంస్థ ఎండీ మహిమా దాట్ల పేర్కొన్నారు.
కూ తోనూ తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
ఇది ఇలావుండగా, దేశీయ సోషల్ మీడియా దిగ్గజం 'కూ'తోనూ తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 35 మిలియన్ల డౌన్ లోడ్స్ ఉన్న కూ.. తెలంగాణలో అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం కేటీఆర్ సమక్షంలో కూ ప్రతినిదులు, ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ప్రస్తుతం దేశంలో హిందీ, తెలుగు సహా 10 భాషల్లో.. స్థానిక భాషలో వీడియోలు, ప్రాంతీయ భాషల్లో రాసి పోస్టు చేసే అవకాశం ఉన్నందున కూ సంస్థ భవిష్యత్తులో మరిన్ని భాషలకు విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది.
సోషల్ మీడియాతో పనులు మరింత వేగం: కేటీఆర్
ప్రతి విషయాన్ని ట్విట్టర్ తరహా పోస్టు చేసుకునే అవకాశాన్ని, అదనపు ఆప్షన్లను కలిగి ఉండటం కూ యాప్ ప్రత్యేకత. ఈ సందర్భంగా కేటీఆర్ స్పందిస్తూ.. సోషల్ మీడియా ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా ఉంటే ప్రభుత్వం మరింత వేగంగా, మెరుగ్గా పనిచేసేందుకు అవకాశం ఉంటుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.