నిప్పుల కొలిమిలా తెలంగాణ: ఆదిలాబాద్లో 44.4డిగ్రీల ఉష్ణోగ్రత
ఇప్పటివరకు 42.4డిగ్రీల ఉష్ణోగ్రతనే అత్యధికం కాగా.. తాజాగా ఆదిలాబాద్ లో 44.4డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడం గమనార్హం.
హైదరాబాద్: భగ్గుమంటున్న ఎండలతో తెలంగాణ రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఈ సీజన్ లో ఇప్పటివరకు 42.4డిగ్రీల ఉష్ణోగ్రతనే అత్యధికం కాగా.. తాజాగా ఆదిలాబాద్ లో 44.4డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడం గమనార్హం. అలాగే మహబూబాబాద్ లోను 44డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
సోమవారం నాడు కూడా ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిని చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణ ఉష్ణోగ్రతల కన్నా మరో 4డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగవచ్చునని పేర్కొంది. ఇక ఆంధ్రప్రదేశ్ లోను ఉష్ణోగ్రతలు భారీగానే ఉన్నాయి. తిరుపతిలో 43.3డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఎండలకు తాళలేక చాలామంది ఇంటికే పరిమితమవుతున్నారు. పంటలు కూడా భారీ స్థాయిలో ఎండిపోయే ప్రమాదం ఏర్పడింది. శనివారం నాడు ఎండ వేడి తట్టుకోలేక వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో భక్తులు సమర్పించిన రెండు కోడెలు(ఎద్దులు) మృతి చెందాయి.

గడిచిన 25రోజుల్లో మొత్తం 15ఎద్దులు మృత్యువాత పడినట్లు ఆలయ అధికారులు చెప్పారు. తిప్పాపురంలోని పశువుల క్షేత్రాన్ని సిబ్బంది పట్టించుకోవడం లేదని, అందువల్లే పశువులు మృతి చెందుతున్నాయని అన్నారు. కాగా, వేములవాడలో కోడె మొక్కులు చెల్లించడం ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం. మంచి జరగాలని మొక్కుకున్నవాళ్లు ఇక్కడి ఆలయంలో కోడెలను దానం చేస్తారు.
ప్రస్తుతం తిప్పాపూర్ పశుక్షేత్రంలో మొత్తం 300 ఎద్దులు, 50ఆవులు ఉండగా.. వీటి నిర్వహణ కోసం ఆలయ అధికారులు రూ.50లక్షల దాకా ఖర్చు చేస్తున్నారు. ఎండ వేడి నుంచి పశువులను రక్షించేందుకు పశుక్షేత్రంలో ఎయిర్ కూలర్లు పెట్టించడంతో పాటు వెదురు తడికలు ఏర్పాటు చేశామని ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి రాజేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. వీలైనంత త్వరగా వాటికి పచ్చగడ్డి సరఫరా చేస్తామని అన్నారు.












Click it and Unblock the Notifications