టీవీ ప్రోగ్రాం 'రియాల్టీ' గిఫ్ట్ కోసం.. నిప్పుతో చెలగాటం, మృతి (పిక్చర్స్)
హైదరాబాద్: రియాల్టీ షోలో వచ్చే ప్రోగ్రాంను అనుసరించబోయి హైదరాబాదులోని పాతబస్తీలో జలీల్ అనే 19 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. అతను ఒంటి పైన కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకున్నాడు. షర్టు తీయడంలో ఆలస్యం కావడంతదో మంటలు అంటుకొని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
నిప్పుతో చెలగాటమాడితే అంతర్జాతీయంగా పేరొస్తుందని, ఓ హిందీ టీవీ ఛానల్ కార్యక్రమంలో ప్రసారమైతే బహుమతి వస్తుందన్న ఆశతో జలీల్ చేసిన ప్రయత్నం అతని ప్రాణాల్నే బలిగొంది. తీవ్రగాయాలపాలైన యువకుడు రెండు రోజుల చికిత్స అనంతరం ఆదివారం రాత్రి చనిపోయాడు.
యువకులు ప్రమాదకరమైన విన్యాసాలను నిపుణుల పర్యవేక్షణలో చిత్రీకరించి పంపితే ప్రసారం చేసే కార్యక్రమాన్ని ఓ హిందీ ఛానెల్ నిర్వహిస్తోంది. నిర్వాహకులు ఈ విన్యాసాలను పరిశీలించి, దేశంలో ఎవరూ ఇలాంటివి చేయలేదని నిర్ధరణ అయితే తమ ఛానెల్లో ప్రసారం చేస్తారు. బహుమతి కూడా ఇస్తారు.
సాహసంలో విషాదం
ఈ కార్యక్రమాన్ని చూసిన పాతబస్తీకి చెందిన జలీల్ తాను కూడా సాహసకార్యం చేయాలనుకున్నాడు. మంటను నోటిపై రాసుకుని ఊదడం, అంగీపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాక క్షణాల్లో దాన్ని తీసేయడం వంటి రెండు అంశాలను ఎంచుకున్నాడు. కొద్దిరోజులు అభ్యాసం చేశాక వీడియో చిత్రీకరించి ఛానెల్కు పంపించాలని నిర్ణయించుకున్నాడు.
సాహసంలో విషాదం
ఈ నెల 7న సాయంత్రం 5 గంటలకు ఫలక్నుమాలోని తన ఇంటికి సమీపంలో ఒక ప్రార్థనా మందిరం వద్దకు నలుగురు కుర్రాళ్లను తీసుకెళ్లాడు. తాను చేసే విన్యాసాలను చరవాణిలో చిత్రీకరించాలని చెప్పాడు. బ్రీతింగ్ ఫైర్ విన్యాసం చేసేటప్పుడు పిల్లలు వీడియో తీశారు.
సాహసంలో విషాదం
ఇది విజయవంతంగా పూర్తయ్యాక టీ షర్ట్ పైన కిరోసిన్ పోసుకున్నాడు. నిప్పంటించుకుని క్షణాల్లో దాన్ని తొలగించాలనుకున్నా అది పైకి రాలేదు. దీంతో మంటలు ఛాతీ, ముక్కులోకి వెళ్లాయి. చిత్రీకరిస్తున్న పిల్లలు భయంతో పరిగెత్తుకెళ్లి దగ్గరలో ఉన్నవారికి చెప్పారు. వారు అతనిని వెంటనే ఉస్మానియాలో చేర్పించారు.
సాహసంలో విషాదం
మూడురోజుల పాటు చికిత్స పొందిన తర్వాత ఆదివారం రాత్రి అతను చనిపోయాడు. అతని మరణ వాంగ్మూలం తీసుకుని ఐపీసీ 174 సెక్షన్ కింద కేసు నమోదు చేశామని దక్షిణ మండల డీసీపీ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, అవసరమైతే సదరు ఛానెల్ నిర్వాహకులకు తాఖీదులు జారీ చేస్తామని చెప్పారు.