గ్రామాలకు ఐటీ, సర్వేలో ఊహించనివి: కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాలకు ఐటీ సేవలు విస్తరించనుననట్లు రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శనివారం చెప్పారు. గ్రామ సచివాలయంలో సర్టిఫికేట్లు మొదలుకుని వృద్ధాప్య, వితుంతు పింఛన్లు, ఉపాధి హామీ కూలి వరకూ ఈ-పంచాయితీల ద్వారా అన్నీ ఒకేచోట అందించనున్నారు. ఐటీకి పంచాయితీలను అనుసంధానించి పాలనా తీరును బలోపేతం చేయనున్నారు. కొత్త బాధ్యతలు స్వీకరించేందుకు పంచాయితీలు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ ప్రకటించారు.
దసరా రోజున కొత్త పింఛన్ పథకాన్ని ప్రకటిస్తారు. నవంబర్ నుంచి ఈ-పంచాయితీల ద్వారా లబ్దిదారులకు పింఛన్ అందుతుంది. తెలంగాణలో మొత్తం 8,800 గ్రామ పంచాయితీలు ఉండగా, తొలి విడతగా 2009 పంచాయితీలను ఈ-పంచాయితీలుగా మార్చనున్నారు. ఈ-పంచాయితీలుగా మార్చడానికి బ్రాడ్ బ్యాండ్ సేవలు అవసరం. తెలంగాణలో 700 నుంచి 800 గ్రామాల్లో మాత్రమే బ్రాడ్ బ్యాండ్ సేవలు అందుతున్నాయి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతోందన్నారు.
అన్ని గ్రామాలకూ బ్రాడ్ బ్యాండ్ సేవలు అందిన తరువాతే ఈ-పంచాయితీలుగా మార్చాలంటే చాలాకాలం పడుతుందని, అందుకే ప్రత్యామ్నాయ మార్గాలను అమలు చేయనున్నట్టు మంత్రి ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం వందరోజుల పాలన సందర్భంగా పంచాయితీరాజ్ శాఖ మంత్రి శనివారం మీడియాతో మాట్లాడారు. ఈ-పంచాయితీల కోసం కేబుల్ ఆపరేటర్ల సేవలు, డిష్ల ద్వారా టీవి ప్రసారాలు అందజేస్తున్న కంపెనీల సేవలు ఉపయోగించుకోన్నుట్టు తెలిపారు.

తొలి విడతగా త్వరలోనే రెండు వేల గ్రామాలను ఈ-పంచాయితీలుగా మారుస్తాం. దీనికి అవసరమైన కంప్యూటర్లు, ప్రింటర్ల వంటి హార్డ్వేర్ అంతా అందుబాటులో ఉంది. వాటిని గ్రామాలకు తరలిస్తున్నాం అని చెప్పారు. ఐదేళ్లకాలంలో తెలంగాణలోని అన్ని గ్రామాలు ఈ-పంచాయితీలుగా మారిపోతాయని ఆయన ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా పథకాన్ని ప్రకటించిందని, ఆ పథకం కన్నా ముందే తెలంగాణలోని రెండువేల గ్రామాలు ఈ-పంచాయితీలు కానున్నాయని తెలిపారు.
ఈ-పంచాయితీలుగా మార్చిన గ్రామాల్లో వన్స్టాప్ షాప్లు ఏర్పాటు చేస్తారు. గ్రామానికి సంబంధించిన అన్ని సౌకర్యాలు అక్కడి నుంచే పొందవచ్చు. తరువాత ఆ గ్రామంలోని అన్ని రకాల పింఛన్లను ఈ వన్స్టాప్ షాప్ల ద్వారా అందిస్తారు. బయోమెట్రిక్ విధానం అమలు చేసి వృద్ధాప్య పింఛన్లు, వికలాంగుల పింఛన్లు, ఉపాధి హామీ పథకం లబ్దిదారులకు కూలీ ఇక్కడే అందిస్తారు. హరితవనం పథకం కింద 230 కోట్ల మొక్కల పెంపకం చేపట్టనున్నట్టు తెలిపారు.
పంచాయితీరాజ్ శాఖ ద్వారా 120 కోట్ల మొక్కలు, అటవీ శాఖ ద్వారా 110 కోట్ల మొక్కలు పెంచనున్నట్టు తెలిపారు. దీనివల్ల తెలంగాణలో 33శాతం పచ్చదనం ఏర్పడుందని, పర్యావరణానికి ఉపయుక్తంగా మారుతుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. మైనర్ ఇరిగేషన్ వ్యవస్థను పటిష్టపరచనున్నట్టు తెలిపారు. గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరిస్తామన్నారు. ఉపాధి హామీ పథకం పనులను కూడా మైనర్ ఇరిగేషన్ పనులతో అనుసంధానించనున్నట్టు చెప్పారు.
ధాన్యం నిల్వ కోసం 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 500 గోదాములు నిర్మిస్తున్నట్టు చేప్పారు. ఆగస్టు 15, 2015 నాటికి ప్రతి పాఠశాల్లో విద్యార్థినీ విద్యార్థులకు విడివిడిగా మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయనున్నామని, 2018 నాటికి ప్రతి ఇంటికి ప్రత్యేకంగా మరుగుదొడ్డి ఉండే విధంగా పథకాన్ని అమలు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. నాలుగేళ్లలో ఇంటింటికి నల్లా పథకం అమలు చేయనున్నారు. వాటర్ గ్రిడ్ కోసం 20వేల కోట్ల రూపాయలు ఖర్చు కావొచ్చన్నారు.
సమగ్ర కుటుంబ సర్వేలో ఊహించని విధంగా వివరాలు తెలిశాయని మంత్రి రామారావు తెలిపారు. 96 లక్షల కుటుంబాల వివరాలు కంప్యూటరీకరించామన్నారు. పూర్తి వివరాల కంప్యూటరీకరణకు మరో నాలుగైదు రోజుల సమయం పడుతుందన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 3.58 కోట్లమంది ప్రజలు ఉన్నారని, అయితే సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం తెలంగాణలో జనాభా సంఖ్య 4.2 కోట్ల వరకూ ఉందన్నారు. దీని ప్రకారం కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications