హైదరాబాద్ వైద్యుడు కోనేటి నాగేశ్వరరావు ఆవిష్కరణకు పేటెంట్ మంజూరు
హైదరాబాద్ నగరానికి చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ కోనేటి నాగేశ్వరరావు అరుదైన ఘనతను సాధించారు.
హైదరాబాద్: నగరానికి చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ కోనేటి నాగేశ్వరరావు అరుదైన ఘనతను సాధించారు. పుట్టుకతోనే చిన్న పిల్లల గుండెలో ఏర్పడే రంధ్రాలను మూసివేసేందుకు రూపొందించిన వైద్య పరికరానికి గానూ భారత ప్రభుత్వం తాజాగా ఆయనకు పేటెంట్ మంజూరు చేసింది.

చిన్నారి గుండెకు రంధ్రం మూసివేసే పరికరంపై కోనేటి పరిశోధన
ప్రతి వెయ్యి మంది శిశువుల్లో పది మందికి వివిధ కారణాలతో పుట్టుకతోనే గుండెలో సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. ఇందులో వెంట్రిక్యూలర్ సెప్టెల్ డిఫెక్ట్(వీఎస్డీ) కారణంగా గుండె దిగువ గదుల్లో రంధ్రం ఏర్పడి సమస్యలకు దారితీస్తుంది. ఈ రంధ్రాలను మూసివేసే పరికరాన్ని రూపొందించేందుకు చిన్న పిల్లల హృద్రోగ చికిత్స నిపుణులు, రెయిన్బో ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ కోనేటి నాగేశ్వరరావు తన బృందంతో పరిశోధనలు చేశారు. 2009లో ఆయన అనుకున్నది సాధించారు.

ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండానే రంధ్రం మూసివేసే పరికరం
డాక్టర్ నాగేశ్వరరావు రూపకల్పన చేసిన పరికరానికి కోనార్-ఎంఎఫ్ డివైజ్గా పేరు పెట్టారు. దీనికి విదేశాల నుంచి కూడా అనుమతులు వచ్చాయి. ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండానే.. ట్రాన్స్ క్యాథటర్ ద్వారా ఈ పరికరాన్ని గుండె గదుల మధ్య అమర్చి రంధ్రాలను మూసివేస్తారు. మనదేశంతోపాటు జర్మనీ, ఇటలీ, బ్రిటన్, అమెరికా తదితర 72 దేశాల్లో ఇప్పటికే వెయ్యి మందికిపైగా చిన్నారులకు విజయవంతంగా దీన్ని వినియోగించడం గమనార్హం.

డాక్టర్ కోనేటి నాగేశ్వరరావు వైద్య ఆవిష్కరణకు పేటెంట్ మంజూరు
ఈ పరికరంపై 2012లో అమెరికా కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ సదస్సులో పరిశోధన పత్రం సమర్పించగా.. ఉత్తమ ఆవిష్కరణ కింద ఎంపికైంది. తాజాగా, భారత ప్రభుత్వం కూడా ఈ పరికరానికి సంబంధించి డాక్టర్ కోనేటి నాగేశ్వరరావుకు పేటెంట్ మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్రం నుంచి ఉత్తర్వులు అందాయని డాక్టర్ నాగేశ్వరరావు ఒక ప్రకటనలో వెల్లడించారు. హైదరాబాద్ నగరానికి చెందిన వైద్యుడు అరుదైన ఘనతను సాధించడం పట్ల ఆయన సహచరులు, ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు.












Click it and Unblock the Notifications