డేటా చోరీ ఇష్యూ... ఇలా చేస్తున్నారు: టీడీపీ సేవామిత్ర, ఐటీ గ్రిడ్పై సీపీ ఏం చెప్పారంటే
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపుతున్న డేటా చోరీ కేసుపై హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ బుధవారం స్పందించారు. సేవామిత్ర యాప్ ద్వారా ఎన్నికల సరళిపై సర్వే చేస్తున్నారని, క్షేత్రస్థాయిలో ఆధార్ నెంబర్, విద్య, సామాజిక వర్గం వివరాలు సేకరిస్తున్నారన్నారు. క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారాన్ని ఐటీ గ్రిడ్ పరిశీలిస్తోందన్నారు.
నన్ను జగన్ను కలుపుతారా, డేటాచోరీపై ఆటలు ఆపండి: కేసీఆర్-బాబులపై పవన్ కీలక వ్యాఖ్యలు
ఏ పార్టీకి ఓటు వేస్తారో తెలుసుకుంటున్నారు
సేవామిత్ర యాప్ ద్వారా ఎన్నికల సరళిపై సర్వే చేస్తున్నారని సీపీ అంజన్ కుమార్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేస్తారని ఫోన్ చేసి మరీ తెలుసుకుంటున్నారని చెప్పారు. ఏ పార్టీకి ఎంత రేటింగ్ ఇస్తారో కూడా తెలుసుకుంటున్నారన్నారు. వ్యక్తిగత వివరాలతో ఆధార్ కార్డు, ఇతర ఐడీ ప్రూఫ్లను సేకరించారన్నారు. ఈ డేటాపై ఫిర్యాదు చేసిన ఇద్దరు కూడా హైదరాబాదులో ఉంటున్నారని, అందుకే ఈ కేసును తాము దర్యాఫ్తు చేస్తున్నామని చెప్పారు.
అన్ని కోణాల్లో దర్యాఫ్తు
మార్చి 3వ తేదీన దశరథరామిరెడ్డి ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని చెప్పారు. అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేస్తామని స్పష్టం చేశారు. ఫిర్యాదుదారు హైదరాబాద్ వాసి కాబట్టే ఇక్కడ కేసు నమోదు చేశామని తెలిపారు. ఐటీ వరల్డ్ సర్వర్ నుంచి డేటా ఇవ్వాల్సిన బాధ్యత గూగుల్, అమెజాన్ సంస్థల పైన ఉందని చెప్పారు.
ఏపీ ఓటర్ల వివరాలు ఉన్నాయి
సేవామిత్ర వెబ్సైట్లో బూత్ కన్వీనర్, డ్యాష్ బోర్డు వివరాలు ఉన్నాయని చెప్పారు. ఏపీ ఓటర్లు చాలామంది ఉద్యోగం నిమిత్తం హైదరాబాదులో ఉంటున్నారని తెలిపారు. వ్యక్తుల రాజకీయ ప్రాధాన్యం ఎందుకు తెలుసుకుంటున్నారో తెలియాల్సి ఉందని చెప్పారు.