డ్రగ్స్ ముఠా గుట్టురట్టు: 5గురు అరెస్ట్, 14కిలోల డ్రగ్స్ స్వాధీనం
రంగారెడ్డి: కీసర మండల పోలీస్ స్టేషన్ పరిధి రాంపల్లి కేంద్రంగా కొనసాగుతున్న మాదక ద్రవ్యాల(డ్రగ్స్) తయారీ కేంద్రం గుట్టును సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం(ఎస్ఓటి) పోలీసులు ఆదివారం రాత్రి రట్టు చేశారు.
రూ. 7కోట్ల విలువైన 13.5 కిలో మెతాం పెటమైన్, 60 కిలోల టార్టారిక్ ఆమ్లం, 800 గ్రాముల తడి మెతాంపెటమైన్, లాప్టాప్, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత డ్రగ్స్ను చెన్నైకి రవాణా చేస్తున్నారనే సమాచారం మేరకు నిఘా పెట్టడంతో మేడిపల్లికి చెందిన రమేష్(34) పోలీసులకు చిక్కాడు.
అతడు ఇచ్చిన సమాచారంతో నల్గొండ జిల్లా బొమ్మల రామారానికి చెందిన డ్రైవర్ సంతోష్ కుమార్(27), దిల్సుఖ్నగర్ కొత్తపేటకు చెందిన ఆటో డ్రైవర్ అనిల్(33), నల్గొండ జిల్లా భువనగిరికి చెందిన హెల్పర్ రోషన్(33), శంషాబాద్కు చెందిన డ్రైవర్ రాంచందర్(34)ను అరెస్ట్ చేశామని ఎస్ఓటి ఓఎస్డి రాంచంద్రారెడ్డి తెలిపారు.
కాగా, గతంలోనూ వీరిపై కొన్ని మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయని తెలిపారు.. అంతర్జాతీయ మార్కెట్లో కిలో మెతాంపెటమైన్ విలువ రూ. 40 నుంచి రూ. 50లక్షల మేర ఉంటుందని వెల్లడించారు.