రైళ్లలో చోరీలు, పట్టివేత: ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులు
హైదరాబాద్: రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను రైల్వే పోలీసులు గురువారంనాడు పట్టేశారు. ఆ ముఠాలో ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. వారి నుంచి 12 లక్షల రూపాయల విలువ చేసే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు ఎం శోభ (36), వి. మంజుల (26) సికింద్రాబాదుకు చెందినవారని, వారు దినసరి కూలీలుగా పనిచేస్తున్నారని సికింద్రాబాదు రైల్వే పోలీసు సూపరింటిండెంట్ ఎస్. జె. జనార్దన్ మీడియాతో చెప్పారు. ఆదాయం సరిపోకపోవడంతో ఆ ఇద్దరు కూడా చోరీలకు దిగారు.
రైళ్లలో చోరీలు చేయడంలో ఆ మహిళలకు వారి పిల్లలు సహకరిస్తూ వస్తున్నారు. రద్దీగా ఉండే కదులుతున్న రైళ్లలోనూ, బుకింగ్ కౌంటర్స్, ఎస్కలేటర్స్ ప్రయాణికులను దోచుకోవడం సాగించారు. ప్లాట్ఫారం వద్ద నిలబడే వారిని కూడా దోచుకున్నారు.
బంగారు ఆభరణాలు, నగదు, పర్సులు, చేతి సంచులు కొట్టేయడం పనిగా పెట్టుకున్నారు. తమకు అందిన సమాచారం మేరకు రైల్వే పోలీసులు వారిని అరెస్టు చేశారు. వారి నుంచి పోలీసులు 43 తులాల బంగారం, 9 తులాల వెండి స్వాధీనం చేసుకున్నారు. మహిళలను రిమాండ్కు తరలించగా, పిల్లలను రెస్క్యూ హోమ్కు తరలించారు.