హైదరాబాద్ నలుమూలాల మెట్రో విస్తరణ: ఈ మార్గాల్లో డబుల్ డెక్కర్ మెట్రో
హైదరాబాద్: టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది తెలంగాణ కేబినెట్. సోమావరం సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గం సమావేశమైంది. ఐదు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి కేటీఆర్ మీడియాకు వెల్లడించారు.రూ. 60 వేల కోట్లతో మూడు, నాలుగేళ్లలో హైదరాబాద్ మెట్రో వ్యవస్థను భారీగా విస్తరించాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
రాయదుర్గం నుంచి విమానాశ్రయం వరకు మెట్రో రైలు టెండర్ ప్రక్రియ జరుగుతోంది. ఇస్నాపూర్ నుంచి మియాపూర్ వరకు మెట్రో విస్తరణకు నిర్ణయం తీసుకున్నాం. మియాపూర్ నుంచి లక్డీకపూల్ వరకు, ఎల్బీనగర్ నుంచి పెద్ద అంబర్పేట వరకు, ఉప్పల్ నుంచి బీబీనగర్, ఈసీఐఎల్ వరకు మెట్రో విస్తరణకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

భవిష్యత్తులో షాద్ నగర్ వరకు మెట్రో విస్తరణ చేపడతామన్నారు. మెట్రో విస్తరణ కోసం కేంద్ర ప్రభుత్వం సాయం కోరతామన్నారు. సాయం చేసినా చేయకున్నా చేపడతామన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత వచ్చే సంకర్ణ ప్రభుత్వ సాయంతోనైనా చేపడతామన్నారు. వచ్చే ప్రభుత్వం బీఆర్ఎస్ కీలకంగా ఉంటుందని చెప్పుకొచ్చారు.
మరోవైపు, జేబీఎస్ నుంచి తూంకుంట వరకు, ప్యాట్నీ నుంచి కండ్లకోయ వరకు డబుల్ డెక్కర్ మెట్రో నిర్మాణం చేపడతామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఒక లెవల్లో వాహనాలు, మరో లెవల్లో మెట్రో ఏర్పాటు చేయడానికి కేబినెట్ తీర్మానించింది. దీంతో రోడ్డు మార్గంతోపాటు మెట్రో మార్గం కూడా ఏర్పడుతుందని, రవాణా సులభమవుతుందని తెలిపారు. అంతేగాక, వరంగల్ మామునూరులో విమానాశ్రయం కోసం 253 ఎకరాలు ఇవ్వడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
రాష్ట్రంలో అనాథ పిల్లల సంరక్షణ కోసం అర్బన్ పాలసీ తీసుకొస్తున్నామన్నారు. మహబూబాబాద్లో ఉద్యాన కాలేజీ ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. హైదరాబాద్లో హైబ్రిడ్ విధానంలో 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటుకు ఆమోదం లభించింది. నిమ్స్లో రూ. 1800 కోట్లతో మరో 2 వేల పడకల ఏర్పాటుకు నిర్ణయం. బీడీ కార్మికులతోపాటు బీడీ టేకేదారులకు పింఛన్లకు నిర్ణయం తీసుకుంది. గవర్నర్ వెనక్కి పంపిన బిల్లులను తిరిగి అసెంబ్లీ ఆమోదిస్తామని, అప్పుడు గవర్నర్ ఆమోదం అవసరం ఉండదని కేటీఆర్ చెప్పారు.
Telangana Cabinet takes a landmark decision to expand Hyderabad Metro at a cost of Rs.60,000 crores to improve transportation and connectivity for the residents.
— BRS Party (@BRSparty) July 31, 2023
హైదరాబాద్ మెట్రోను భారీగా విస్తరించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం.. రూ.60 వేల కోట్లతో హైదరాబాద్ నలువైపులా మెట్రో… pic.twitter.com/fpeN5C2NuN
వరద సాయం కోసం రూ. 500 కోట్లు
జులై 18 నుంచి 28 వరకు రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైందని మంత్రి కేటీఆర్ తెలిపారు. పది జిల్లాల్లో రైతులు, ప్రజలకు తలెత్తిన తీవ్ర నష్టంపై కేబినెట్లో చర్చించామన్నారు. తక్షణ సాయం కింద రూ. 500 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇద్దరు విద్యుత్ ఉద్యోగులు ఉద్యోగ ధర్మాన్ని అద్భుతంగా నిర్వర్తించారని.. వారిని ఆగస్టు 15న ప్రభుత్వం సత్కారం చేయనుందన్నారు. అలాగే ఆశ్రమ పాఠశాలలో 40 మంది పిల్లలను కాపాడిన టీచర్ను సన్మానిస్తామన్నారు మంత్రి కేటీఆర్.












Click it and Unblock the Notifications