పూర్తిస్థాయిలో మెట్రో సర్వీసులకు వేచి చూడాల్సిందే: పోటెత్తిన జనంతో టికెట్ కౌంటర్ల మూసివేత
హైదరాబాద్: మియాపూర్.. అమీర్పేట్.. నాగోల్.. ఏ స్టేషన్ చూసినా ఇసుకేస్తే రాలనట్టుగా జనం.. ఇక మెట్రో రైళ్ల సంగతి సరే సరి.. రైలులోకి ఎక్కేందుకు.. దిగేందుకు కూడా ఖాళీ లేనంతగా మెట్రో రైళ్లు కిక్కిరిసిపోయాయి.మెట్రో ప్రారంభమయ్యాక వచ్చిన తొలి ఆదివారం కావడంతో భాగ్య నగరవాసులు చాలా మంది పిల్లాపాపలతో విహారానికి వచ్చారు.ఎలివేటెడ్ మార్గంలో ప్రయాణిస్తూ నగర అందాలను చూసి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు.ప్రారంభ స్టేషన్లు నాగోల్, అమీర్పేట, ఉప్పల్ స్టేషన్లతోపాటు అమీర్పేట ఇంటర్ఛేంజ్ స్టేషన్లోని మూడంతస్తుల్లోనూ జనమే జనం. ఫ్లాట్ఫాంపై నిలబడేందుకు కూడా చోటులేకపోయింది. ప్రస్తుతం నాగోల్ నుంచి అమీర్పేట మార్గంలో 15 నిమిషాలకు ఒకటి, మియాపూర్ నుంచి అమీర్పేటకు ఎనిమిది నిమిషాలకు ఒక మెట్రోను నడిపిస్తున్నారు. 14 మెట్రోరైళ్లను రోజంతా 120 ట్రిప్పులు నడుపుతున్నారు.
ఇవేవీ ఆదివారం ప్రయాణికుల రద్దీని తట్టుకోలేకపోయాయి. కానీ ఆగమేఘాలతో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను ప్రారంభించడం కూడా ఒక్కోసారి సమస్యగానే పరిణమిస్తుంది. అత్యాధునిక వ్యవస్థలతో ఏర్పాటైన హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసులను ప్రారంభించడానికి ముందు టెస్ట్ ట్రయల్స్ పూర్తిస్థాయిలో చేపట్టలేదు. సాంకేతికత సహకారంతో మెట్రో రైలు సర్వీసులు ప్రారంభమైతే మూడు నిమిషాలకు ఒక రైలు అందుబాటులోకి వస్తుంది.

ఐదు రోజుల్లోనూ 10 లక్షలు దాటిన ప్రయాణికులు
ఆదివారం ఏకంగా 2.40 లక్షల మంది ప్రయాణించి ఉంటారని మెట్రో వర్గాల అంచనా. ఐదు రోజుల్లోనే రికార్డు స్థాయిలో ప్రయాణికుల సంఖ్య దాదాపు 10 లక్షలకు చేరుకుంది. రద్దీని తట్టుకునేలా ఎక్కువ మెట్రోరైళ్లను నడిపేందుకు సాంకేతికంగా వెసులుబాటు లేకపోయింది. ఇక ప్రయాణీకుల రద్దీ వల్ల మెట్రో స్టేషన్లలోని టికెట్ విక్రయ యంత్రాలు, కౌంటర్ల వద్ద జనం బారులుతీరారు. దీంతో ప్రయాణికులను అదుపు చేసేందుకు టికెట్ కౌంటర్లను మధ్యమధ్యలో మూసేశారు. మెట్రో ఎక్కేందుకే కాదు టోకెన్ల కోసం కూడా అధిక సమయం వేచి చూడాల్సి వచ్చింది.

సీబీటీసీ అమల్లోకి వస్తే మూడు నిమిషాలో సర్వీస్
మెట్రోరైల్.. కమ్యూనికేషన్ బేస్డ్ కంట్రోల్ సిస్టమ్ (సీబీటీసీ)తో నడిచే అత్యాధునిక వ్యవస్థ కలిగి ఉంది. దీంతో ప్రతి మూడు నిమిషాలకో మెట్రో నడపొచ్చు. నాగోల్ నుంచి మెట్టుగూడ వరకు రెండేళ్లపాటు టెస్ట్, ట్రయల్ చేయడమే కాదు డ్రైవర్ రహిత సాంకేతికతతో విజయవంతంగా నడిపారు. ప్రస్తుతం ఇక్కడి వరకు సీబీటీసీ సాంకేతికతతో నడుస్తోంది. మెట్టుగూడ నుంచి అమీర్పేట మార్గాన్ని హడావుడిగా సిద్ధం చేయడంతో డ్రైవర్రహిత సాంకేతికతను పూర్తి స్థాయిలో పరీక్షించలేకపోయారు. ఈ కొద్దీదూరం డ్రైవర్లే నియంత్రిస్తున్నారు. ఫలితంగా మెట్టుగూడ రాగానే స్టేషన్లో ఆగడంతో పాటు స్టేషన్లో కొంత దూరం వెళ్లగానే మరోసారి ఆగుతుంది. అక్కడి నుంచి ఆటోమేటిగ్గా నడుస్తుంది. దీంతో ఎక్కువ మెట్రోరైళ్లను నడపలేకపోతున్నారు.

ఫుట్పాత్పైనే వాహనాల పార్కింగ్
మియాపూర్ మెట్రో స్టేషన్ సెల్ఫీస్పాట్గా మారింది. స్టేషన్ పరిసరాల్లో ప్రధాని మోదీ ప్రారంభించిన పైలాన్ వద్ద సెల్ఫీలు, ఫొటోలు దిగడానికి యువత ఉత్సాహం చూపింది. ప్రయాణికులు తమ వాహనాలను స్టేషన్ ఆవరణలోని ఫుట్పాత్పైనే వదిలివెళ్తున్నారు. ఇక కార్లు, ద్విచక్రవాహనాలపై మెట్రో స్టేషన్లకు వచ్చిన వారు పార్కింగ్ కోసం తిప్పలు పడ్డారు. మొత్తం 24 స్టేషన్లకు ఐదు చోట్లే పార్కింగ్ వసతి ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆదివారం ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హెలిప్యాడ్ నిర్మించిన ప్రాంతంలో వాహనాలు నిలిపేందుకు వీలుకల్పించారు.

వసతుల్లేక అల్లాడిన ప్రయాణికులు
మెట్రో స్టేషన్ల నుంచి ఆర్టీసీ ఫీడర్ బస్సులు నడుపుతామని అధికారులు చెప్పినా ఇప్పటికీ వాటి జాడ లేదు. ఇక మియాపూర్ స్టేషన్ ఆవరణలో ఉన్న సైకిల్ స్టేషన్లో రిజిస్ట్రేషన్లను త్వరలో ప్రారంభిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఇదిలా ఉంటే అమీర్ పేట మెట్రో స్టేషన్లో బాంబు ఉన్నదని ఆదివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి చెప్పడంతో పోలీసులు ఉరుకులు, పరుగులు తీశారు. స్టేషన్ లో లభించిన బ్యాగ్ సిబ్బందిదని తెలిసి వారికి అప్పగించారు. స్టేషన్లలో మంచినీటి వసతి లేకపోవడం, రద్దీకి అనుగుణంగా టాయిలెట్స్ లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు.












Click it and Unblock the Notifications