నిలిచిపోయిన హైదరాబాద్ మెట్రో రైళ్లు: ప్రయాణికుల ఇక్కట్లు (వీడియో)
హైదరాబాద్: మెట్రో రైలు సేవలకు శుక్రవారం అంతరాయం ఏర్పడింది. మియాపూర్-ఎల్బీనగర్, ఎల్బీనగర్-మియాపూర్ మార్గాల్లో సుమారు అరగంటకుపైగా సేవలు నిలిచిపోయాయి. ఆ తర్వాత పునరుద్ధరణ చర్యలు చేపట్టడంతో రైళ్లు తిరిగి బయల్దేరాయి.

హైదరాబాద్ మెట్రో సేవలకు అంతరాయం
మెట్రో సేవలకు అంతరాయం కలగడంతో ఆయా మార్గాల్లో వెళ్తున్న రైళ్లను వివిధ స్టేషన్లలో నిలిపివేశారు. ఖైరతాబాద్, లక్డీకపూల్, అమీర్పేట్ తదితర స్టేషన్లలో రైళ్లు ఆగిపోయాయి. మరికొన్ని రైళ్లు మార్గమధ్యలోనూ ఆగిపోయాయి. రైళ్లు ఆగిపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. కార్యాలయాలకు వెళ్లేవారు, గమ్యస్థానాలకు చేరుకునే ప్రయాణికులు ఆలస్యం కావడంపై అసహనం వ్యక్తం చేశారు. అయితే, కొద్దిసేపట్లో సేవలను పునరుద్ధరిస్తామని, సహకరించాలని మెట్రో రైలు సిబ్బంది అనౌన్స్ చేశారు. దీంతో స్టేషన్లలోనే ఉన్న ప్రయాణికులు కొందరు బయటికి వెళ్లిపోయారు.
అరగంటకుపైగా నిలిచిపోయిన హైదరాబాద్ మెట్రో రైళ్లు
అనంతరం పునరుద్ధరణ చర్యలు చేపట్టడంతో రైళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి. మెట్రో రైళ్ల సుమారు అరగంటకు పైగా నిలిచిపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. సాంకేతిక లోపంతోనే మెట్రో సేవలకు అంతరాయం కలిగినట్లు సమాచారం. దీనిపై మెట్రో అధికారులు స్పందించాల్సి ఉంది. ఇటీవల కాలంలో పలు మెట్రో రైళ్లు సాంకేతిక లోపంతో ఆగిపోయిన ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం.
మెట్రో ఆలస్యంపై ప్రయాణికుల అసంతృప్తి
నవంబర్ 4వ తేదీన ఉదయం చాలా సమయంపాటు మెట్రో రైలు సర్వీసులు కదల్లేదు. సిగ్నలింగ్ వ్యవస్థలో ఏర్పడిన లోపమంటూ చాలా సేపు రైళ్లను ఆపేశారు. రద్దీ బాగా ఉన్న సమయంలో అనుకోకుండా రైళ్లు ఆగిపోతుండటంతో తాము ఇబ్బందులకు గురవుతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. మెట్రో రైలు సేవలకు అంతరాయం కలగడంపై సోషల్ మీడియా వేదికగా ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications