హైటెక్ సిటీలో ఘోర ప్రమాదం: ఎంఎంటీఎస్ రైలు ఢీకొని ముగ్గురు మృతి
హైదరాబాద్: నగరంలోని హైటెక్ సిటీ సమీపంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎంఎంటీఎస్ రైలు ఢీకొని ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. హైటెక్ సిటీ సమీపంలో మూల మలుపు వద్ద వేగంగా వస్తున్న ఎంఎంటీఎస్ రైలును గమనించకుండా పట్టాలు దాటేందుకు ప్రయత్నించి.. ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ప్రమాదంలో మరణించినవారిని రాజప్ప, శ్రీను, కృష్ణగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల్లో ఒకరి వద్ద మద్యం సీసాలు ఉన్నట్లు గుర్తించారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతులు వనపర్తి వాసులని, వీరంతా సంకల్ప్ అపార్ట్మెంట్ సమీపంలో నివసిస్తున్నారని పోలీసులు తెలిపారు.
బాసరలో ఐఐఐటీ విద్యార్థి మృతి
బాసర ఐఐఐటీలో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల కలుషిత ఆహారం తిని అనారోగ్యానికి గురైన ఓ విద్యార్థి మృతి చెందాడు. వరంగల్ జిల్లా సంగెం మండలం ఎల్గూర్ రంగెంపేటకు చెందిన సంజయ్ కిరణ్ (22) బాసర ఐఐఐటీలో పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
ఇటీవల విషతూల్యమైన ఆహారం తీసుకోవడం వల్ల అనారోగ్యం బారిన పడ్డాడు సంజయ్. దీంతో కొంతకాలంగా హనుమకొండ రోహిణి, హైదరాబాద్లోని యశోద ఆస్పత్రుల్లో చికిత్స పొందాడు. వైద్యానికి దాదాపు 16 లక్షలు ఖర్చుచేసినా లాభం లేకపోయింది.
ఐఐటీలో ఆహారం విషతుల్యం కావటం వల్లే.. తమ కుమారుడు ప్రాణాలు కోల్పోయాడని సంజయ్ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. లక్షలు ఖర్చుపెట్టినా తన కుమారున్ని కాపాడుకోలేకపోయామని సంజయ్ తండ్రి శ్రీధర్ గుండెలవిసేలా రోధించాడు. అయితే బాసర ట్రిపుల్ఐటీలో చేరక ముందే సంజయ్ అనారోగ్యం బారిన పడినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి.
ఈ క్రమంలో సంజయ్ కిరణ్ మృతిపై గ్రామంలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.నిర్మల్ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీలో జులై 15న మధ్యాహ్న భోజనం వికటించి 600 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆ రోజు మధ్యాహ్నం ఎగ్ఫ్రైడ్ రైస్ కలుషితం కావడం వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.