ఎంత జుగుప్స చేస్తారంటే?: ఇదీ 'చెడ్డీ' గ్యాంగ్ చరిత్ర.. నడుముకు చెప్పులు కట్టుకుని వెళ్తారు..
Recommended Video
హైదరాబాద్: చాలాకాలం తర్వాత మళ్లీ నగరంలో చెడ్డీ-బనియన్ గ్యాంగ్ హల్ చల్ చేస్తుండటం పోలీసులకు సవాల్ గా మారింది. కూకట్పల్లి, మియాపూర్ పరిసర ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో జరిగిన వరుస చోరీల్లో వీరి హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.
సీసీటీవి ఫుటేజీల్లో బనియన్, నిక్కరు ధరించిన దొంగల దృశ్యాలు రికార్డవడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. చెడ్డీ-బనియన్ వరుస చోరీల నేపథ్యంలో.. వారి నేరాల చిట్టా మొత్తం కూపీ లాగుతున్నారు పోలీసులు. ఈ క్రమంలో పలు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
చెడ్డీ బనియన్ గ్యాంగ్ చరిత్ర:
ముందుగా తమ చోరీల కోసం చెడ్డీ-బనియన్ ఓ నగరాన్ని ఎంచుకుంటుంది. ఆ తర్వాత ముఠా సభ్యులంతా అక్కడ వాలిపోతారు. స్థానిక రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లలో మకాం వేస్తారు. మరికొందరు నగర శివారు ప్రాంతాల్లో.. రోడ్ల పక్కన గుడారాలు వేసుకుని సంచారజాతుల్లా జీవిస్తారు.
కాగా, గత ఆధారాలను పరిశీలిస్తే.. వీరు పార్థీ ముఠా సభ్యులు అని తెలుస్తోంది. మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రల్లో వీరి ముఠాల నివాసాలు ఉన్నట్లు చెబుతారు. బ్రిటీష్ హయాంలో 1871లో ఘరానా నేరాలకు పాల్పడే సుమారు 150తెగలను గుర్తించారు. అందులో పార్థీ తెగ ఒకటి.
ఆ ప్రాంతాల్లో చెడ్డీ గ్యాంగ్ హల్చల్: ప్రజలను అలర్ట్ చేసిన పోలీసులు.. (వీడియో)
పగటివేళ రెక్కీ:
పగలంతా రెక్కీ చేయడం రాత్రివేళల్లో దొంగతనాలు చేయడం ఏళ్లుగా వీరు అనుసరిస్తున్న పద్దతి. అంతేకాదు, పగటిపూట చిన్న చిన్న వ్యాపారులుగా.. రోడ్లపై బెలూన్లు అమ్ముకుంటుంటారు. కొంతమంది బిచ్చగాళ్లు గాను సంచరిస్తారు.
ఆ క్రమంలోనే చోరీకి అనువైన ఇంటిని గుర్తిస్తారు. ప్రధానంగా తాళాలు వేసి ఉన్న ఇళ్లలోనే చోరీలకు ఎంచుకుంటారు. ఆ ఇంటి బాల్కనీలో ఆరేసిన బట్టల ఆధారంగా ఖరీదైన ఇళ్లుగా అంచనా వేస్తారు. దాదాపుగా ముఠాలోని మహిళా సభ్యులే ఈ పనులు చేస్తుంటారని సమాచారం. ఆ సమాచారాన్ని ముఠాలోని పురుషులకు చెబితే.. రాత్రి వేళ చోరీకి రంగం సిద్దం చేసుకుంటారు.
నడుముకు చెప్పులు కట్టుకుని:
చోరీ సమయంలో ఎవరికీ చిక్కకుండా ఉండేందుకు, ఎక్కడా అలికిడి వినిపించకుండా ఉండేందుకు ఈ గ్యాంగ్ చాలా జాగ్రత్తలే తీసుకుంటుంది. ఒంటికి నూనె లేదా గ్రీజు రాసుకునే చోరీలకు వెళ్తారు. చోరీకి వెళ్లేటప్పుడు అడుగుల శబ్దం వినిపించకుండా ఉండేందుకు చెప్పుల్ని నడుముకు కూడా కట్టుకుంటారు. చోరీ కోసం ఇనుప వస్తువులు, రాడ్లు, గొడ్డళ్లు వంటి వాటినే ఎక్కువగా వెంట తీసుకెళ్తారు. కొన్నిసార్లు నాటు తుపాకులు కూడా తీసుకెళ్తారు.
జుగుప్సాకరంగా:
కొన్నిసార్లు చోరీ చేసిన ఇళ్లల్లో జుగుప్సాకర వాతావరణం సృష్టిస్తుంది చెడ్డీ గ్యాంగ్. ఇంట్లో ఆహార పదార్థాలేమైనా ఉంటే.. వాటిని తినేసి ఇంట్లోనే మల, మూత్రాలను విసర్జించి వెళ్లిపోతారు. ఇంటి యజమానులు తిరిగొచ్చాక.. ఇంట్లోని వాతావరణం చూసి కంగు తింటారు. చోరీ సమయంలో ఎవరైనా అడ్డుపడితే లుంగీలు, తాళ్లతోనే కట్టేస్తుంటారు. అవసరమైతే హత్యలకూ వెనుకాడరు.
మకాం మార్చేస్తారు:
వరుస చోరీల తర్వాత ఆ ప్రాంతంలో నిఘా పెరిగిందని భావిస్తే.. వెంటనే తట్టా బుట్టా సర్దుకుని మరో నగరానికి వెళ్లిపోతారు చెడ్డీ గ్యాంగ్. దేవాలయాల్లోను వీరు చేతివాటం ప్రదర్శిస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం . మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, హర్యానా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, తదిరత రాష్ట్రాల్లో ఈ ముఠా దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా పోలీస్ రికార్డులు చెబుతున్నాయి.
గతంలోను నగరంలో చోరీలు:
సీసీటీవి ఫుటేజీలను పరిశీలించిన పోలీసులకు సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఈ ముఠా గతంలో పలు చోరీలకు పాల్పడినట్లు అనుమానం కలిగింది. ఈ చెడ్డీ గ్యాంగ్ ను మధ్యప్రదేశ్ - గుజరాత్ సరిహద్దులోని ఘార్వాడ్ జిల్లా చాడా ప్రాంతానికి చెందిన ఖాజు మావ్గి ముఠాగా అనుమానిస్తున్నారు.
2011లో తొలిసారిగా ఎల్బీనగర్ పరిధిలో చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. అదే ఏడాది జులైలో నార్సింగి, దుండిగల్ పోలీస్ స్టేషన్ల పరిధిలోను చోరీలు జరిగాయి. చెడ్డీ గ్యాంగ్ ముఠా సభ్యుల వేలిముద్రలు వీరితో ఈ చోరీల నిందితులతో సరిపోలాయి. 2016లొ కేపీహెచ్బీ, పేట్బషీరాబాద్ ప్రాంతాల్లో ఈ ముఠా చోరీలు చేసింది.
ఇక ఈ ఏడాది మాదాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, మీర్ పేట ప్రాంతాల్లోను చోరీలు జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ప్రస్తుతం నగరంలోని మూడు కమిషనరేట్ల పోలీసులు వీరిని పట్టుకోవడం కోసం అప్రమత్తమయ్యారు.