హైదరాబాద్ పోలీసులపై అసోంలో కాల్పులు?: అవాస్తవమన్న ఏసీపీ
హైదరాబాద్: సైబర్ నేరగాళ్ల ఆటకట్టించేందుకు తెలంగాణ పోలీసులు రాష్ట్రాల సరిహద్దులు దాటేస్తున్నారు. సూర్యాపేట షూటర్స్కు సంబంధించిన ఉగ్రవాదుల సన్నిహతులైన విశ్వసనీయ సమాచారం అందుకున్న తెలంగాణ పోలీసులు ఒడిషాలోని రూర్కెలా వెళ్లారు.
ఒడిషా-తెలంగాణ పోలీసులు నిర్వహించిన జాయింట్ ఆపరేషన్లో ఉద్రవాదులు కాల్పులు జరిపినా, వెనకడుగు వేయకుండా మూడు గంటల పాటు ఎదురు కాల్పులు జరిపి నలుగురు సిమి ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. [తెలంగాణ-ఒరిస్సా పోలీసుల ఆపరేషన్: 4గురు సిమి ఉగ్రవాదులు అరెస్టు]
తాజాగా అదే తరహాలో అసోం వెళ్లిన తెలంగాణ పోలీసులపై అక్కడ కూడా సైబర్ నేరగాళ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. పలు సైబర్ నేరాలపై ఫిర్యాదులు రావటంతో నేరస్థులను వెతికేందుకు వారం రోజుల క్రితం హైదరబాద్కు ప్రత్యేక బృందం అసోం వెళ్లింది.
పక్కా సమాచారంతో నేరగాళ్లను పట్టుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. దీంతో వీరిని గమనించిన నేరగాళ్లు తమ వద్ద ఉన్న పిస్తోల్తో రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. అయితే అప్రమత్తమైన పోలీసులు సురక్షతంగా బయటపడ్డారు.
ఈ సందర్భంగా తెలంగాణ పోలీసులు ఇద్దరు నేరగాళ్లను అరెస్ట్ చేయడంతో పాటు వారి వద్ద నుంచి రివాల్వర్, నాలుగు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత నిందితులకు సంకెళ్లేసి మరీ రాష్ట్రానికి తీసుకువస్తున్నారు.
దీనిపై సైబర్ క్రైమ్ ఏపీసీ జయరామ్ను వివరణ కోరగా అసోంలో నిందితులను పట్టుకున్న మాట వాస్తమేనన్నారు. పీటీ వారెంట్పై వారిని శుక్ర, శనివారాల్లో ఇక్కడకు తీసుకురానున్నట్లు వివరించారు. అయితే తమ పోలీసులపై కాల్పులు జరిగిన మాట అవాస్తవమని ప్రకటించారు.