అర్ద్రరాత్రి షర్మిల దీక్ష భగ్నం - సీఎం కేసీఆర్ స్పందించాలంటూ : పెరుగుతున్న మద్దతు..!!
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన హత్యాచార ఘటనకు నిరసనగా వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. బాధిత కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ స్పందించే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకున్నారు. అనంతరం అక్కడే దీక్షకు కూర్చున్నారు. ఘటన జరిగి వారం రోజులు అవుతున్నా సీఎం కేసీఆర్ స్పందించకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేసారు.
కేసీఆర్ నోరు విప్పి బాధిత కుటుంబానికి భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చేంత వరకు దీక్ష చేస్తానని షర్మిల స్పష్టం చేశారు. నిందితుడిని ఇంకా పట్టుకోలేకపోవడం పోలీసుల అసమర్థతకు నిదర్శనమని షర్మిల మండిపడ్డారు. కుటుంబ సభ్యులు, మహిళలపై లాఠీచార్జ్ చేసి చిన్నారి మృతదేహాన్ని తీసుకెళ్లారని ఆరోపించారు. 30 వేల జనాభా ఉన్న కాలనీలో ప్రజలకు రక్షణ కరవైందని నిప్పులు చెరిగారు. కాలనీలో మద్యం ఏరులై పారుతోందని, విచ్చలవిడి మద్యం అమ్మకాలతోనే చిన్నారులపై దాడులు పెరిగిపోతున్నాయని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే, ఇప్పటికే పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని జనసేన అధినేత పవన్ తో సహా పలువురు నేతలు హామీ ఇచ్చారు. అప్పటికే షర్మిల దీక్ష కొనసాగుతోంది. ఇదే సమయంలో నిందితుడు రాజు కోసం పెద్ద ఎత్తున పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. నిందితుడు ఆచూకీ చెబితే పది లక్షల నజరానా ఇస్తామని ప్రకటించారు. ప్రభుత్వం సైతం ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది.
Recommended Video
ఇక, షర్మిల దీక్షను భగ్నం చేసిన పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత దీక్షా స్థలికి చేరుకున్న పోలీసులు వైఎస్సార్టీపీ శ్రేణులను అక్కడి నుంచి చెదరగొట్టారు. చిన్నారికి మద్దతుగా దీక్ష చేసిన షర్మిల శిబిరం వద్దకు విజయమ్మ సైతం వచ్చారు. చిన్నారికి మద్దతుగా పార్టీ శ్రేణులతో కలిసి రాత్రి వరకు దీక్ష కొనసాగించారు.