టెకీకి జైలు శిక్ష: అమ్మాయిలను ఫాలో అవుతూ.. అసభ్య మాటలతో..
'మాతో పాటు వస్తే న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుందాం రండి' అంటూ గట్టిగా కేకలు వేశారని పోలీసులు తెలిపారు.
హైదరాబాద్: అమ్మాయిల స్కూటీని ఫాలో అవుతూ వారిని అల్లరి పెట్టిన ఇద్దరు వ్యక్తులను కోర్టు దోషులుగా తేల్చింది. దీంతో నిందితులకు మూడు రోజుల జైలు శిక్ష పడింది. నిందితుల్లో ఒకరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కాగా, మరొకరు విద్యార్థిగా పోలీసులు గుర్తించారు.
వివరాల్లోకి వెళ్తే.. డిసెంబర్31, రాత్రి 10.30గం. ప్రాంతంలో ఎస్ఆర్ నగర్ పరిధిలోని బాపూనగర్ లో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు అమ్మాయిలను ఉపేంద్ర(23), సురేష్(22) అల్లరి చేసే ప్రయత్నం చేశారు. వారి స్కూటీ వెనకాలే తమ బైక్ తో ఫాలో అవుతూ.. గట్టిగా కేకలు వేస్తూ టీజింగ్ కు పాల్పడ్డారు.
నిందితుల్లో ఒకరు తమను తాకే ప్రయత్నం చేశారని బాధిత అమ్మాయిలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుల బైక్ నంబర్స్ ను నోట్ చేసుకున్న అమ్మాయిలు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసభ్యకర మాటలతో అమ్మాయిలను నిందితులు ఇబ్బందికి గురిచేశారని, 'మాతో పాటు వస్తే న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుందాం రండి' అంటూ గట్టిగా కేకలు వేశారని పోలీసులు తెలిపారు.
సీసీటీవి ఫుటేజీ ఆధారంగా కేసును దర్యాప్తు చేయగా.. ఆ సమయంలో నిందితులు ఇద్దరు మద్యం మత్తులో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. నిందితులను అరెస్టు చేసిన అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు వారిని దోషులుగా తేల్చింది. నిందితులు ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తులుగా పోలీసులు తెలిపారు.