ఆవేశం, ఆవేదన: టెక్కీ దంపతుల ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని జగద్గిరిగుట్టలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు, దంపతుల మధ్య నెలకొన్న విభేదాల కారణంగా ఓ జంట ఆత్మహత్యకు పాల్పడింది. మొదట ఆవేశంలో భర్త ఆత్మహత్యకు పాల్పడగా, అది భరించలేక ఆవేదనతో భార్య కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జగద్గిరిగుట్ట పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా సోంపేట ప్రాంతానికి చెందిన ప్రవీణ్(35), అదే మండలం బురువంక గ్రామానికి చెందిన అనిత(26)లకు మూడేళ్ల క్రితం వివాహమైంది. ప్రవీణ్ సాఫ్ట్వేర్ ఉద్యోగి కాగా, ఆమె గృహిణి. వీరికి ఏడాదిన్నర వయసున్న కుమార్తె మోక్షిత ఉంది. మోక్షిత రెండు నెలలుగా అమ్మమ్మ ఇంట్లో ఉంటోంది.
దంపతులిద్దరూ ఏడాదికాలంగా ఆల్విన్కాలనీ ఆదిత్యనగర్లోని అద్దె ఇంట్లో ఉంటున్నారు. కాగా, శనివారం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఇంట్లోని ఓగదిలో ప్రవీణ్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన అనిత.. భర్త ఉరేసుకొన్న తాడు తొలగించేసరికి చనిపోయి ఉన్నాడు. ఆందోళనకు గురైన ఆమె తన బంధువులకు ఫోన్లో సమాచారమిచ్చింది.
నగరంలో నివసిస్తున్న బంధువు వచ్చి చూసేసరికి అనిత కూడా ఫ్యాన్కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న జగద్గిరిగుట్ట ఎస్సై భీంకుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రవీణ్, అనిత మరణాలతో ఇరుకుటుంబాల్లోనూ విషాదం నెలకొంది.